సముద్రంలో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-10-19T03:28:02+05:30 IST

మండలంలోని పెద్ద పట్టపుపాలెం సముద్రతీరంలో గల్లంతైన విద్యార్థి మృతదేహం సోమవారం లభ్యమైంది.

సముద్రంలో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
విద్యార్థి మృతదేహం

కావలి రూరల్‌, అక్టోబరు 18: మండలంలోని పెద్ద పట్టపుపాలెం సముద్రతీరంలో గల్లంతైన విద్యార్థి మృతదేహం సోమవారం లభ్యమైంది. స్థానికుల కథనం మేరకు.. పెద్ద పట్టపుపాలెం కు చెందిన 9వ తరగతి విద్యార్థి పామంజి నాగరాజు(15) గ్రామానికి చెందిన 8 మంది స్నేహితులతో కలసి ఆదివారం సముద్ర స్నానానికి వెళ్లిన విషయం విదితమే. అందులో ఇద్దరు సముద్రంలో అలల తాకిడికి కొట్టుకుపోగా వారిని స్థానిక మత్స్యకారులతో కలసి కాపాడే ప్రయత్నంలో నాగరాజు గల్లంతయ్యాడు. ఆ ఇద్దరిని సురక్షితగా కాపాడిన మత్స్యకారులు నాగరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో సోమవారం ఉదయం మళ్లీ సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టగా నడి సముద్రంలో నాగరాజు మృతదేహం నీటిపై తేలాడుతుండగా ఒడ్డుకు చేర్చారు. మృతుడి తండ్రి ఆదిశేషయ్యకు ముగ్గురు కుమారులు. మూడేళ్ల క్రితం అనారోగ్యంతో ఆదిశేషయ్య మృతి చెందాడు. తల్లి ఆదిలక్ష్మి కూలి పనులు చేసుకుంటుండగా పెద్దకుమారుడు శివ మంగుళూరు బోట్లకు చేపల వేటకు వెళ్తూ తమ్ముళ్లను చదివిస్తున్నాడు. రెండో వాడైన నాగరాజు ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 9వ తరగతి చదువుతూ దసరా సెలవులకు గ్రామానికి వచ్చాడు. అతని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయమై ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు.


Updated Date - 2021-10-19T03:28:02+05:30 IST