కోఠికి వెళ్లిన విద్యార్థిని అదృశ్యం.. ఆయనపై అనుమానం
ABN , First Publish Date - 2021-04-06T12:29:21+05:30 IST
ఇంటి నుంచి పుస్తకం కొనుక్కొవడానికి కోఠి వెళ్లిన విద్యార్థిని
హైదరాబాద్/దుండిగల్ : నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ఇంటినుంచి బయటకు వెళ్లిన ఇద్దరు అదృశ్యమయ్యారు. వివరాలిలా ఉన్నాయి. ఇంటి నుంచి పుస్తకం కొనుక్కొవడానికి కోఠి వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైంది. సూరారం కృష్ణానగర్కు చెందిన అబ్దుల్ గఫార్ కుమారై షేక్ సనా (21) ఈ నెల 4వ తేదీన పుస్తకం కొనుక్కోవడానికి ఇంటి నుంచి కోఠి వెళ్లింది. మధ్యాహ్న సమయంలో తండ్రి ఫోన్ చేయగా వస్తున్నానని చెప్పింది. సాయంత్రం 4 దాటినా రాకపోవడంతో మళ్లీ ఫోన్ చేశాడు. అయితే సనా ఫోన్ స్విచ్ ఆఫ్గా వచ్చింది. ఓ వ్యక్తిపై తమకు అనుమానం ఉందని దుండిగల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గఫార్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తల్లి మందలించిందని..
ఇంటినుంచి వెళ్లిన యువకుడు తిరిగి రాలేదు. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇందిరానగర్ గుడిసెల్లో నివాసముంటున్న షేక్ రవూఫ్ కుమారుడు షేక్ జానీబాష(23) ఓ ప్రైవేటు కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగాలేదు. శుక్రవారం కుటుంబసభ్యులపై విరుచుకు పడడంతో అతన్ని మందలించి తాడుతో బంధించి కూర్చోబెట్టారు. కట్లు విప్పమని బతిమిలాడడంతో తల్లి వాజిద్బీ విప్పింది. కట్లు తీయగానే రాత్రి సుమారు 2 గంటల సమయంలో కోపంగా ఫోన్ తీసుకుని ఇంటినుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఆచూకీ లభించకపోవడంతో తల్లి వాజిద్బీ సోమవారం బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.