మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-12-01T04:21:43+05:30 IST

స్కూల్‌కు వెళ్లమని అమ్మమ్మ మందలించడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి మూడంతస్థుల మేడపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.

మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సందీప్‌

స్కూల్‌కు వెళ్లమని అమ్మమ్మ మందలించడంతో అఘాయిత్యం

పెందుర్తి రూరల్‌, నవంబరు 30: స్కూల్‌కు వెళ్లమని అమ్మమ్మ మందలించడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి మూడంతస్థుల మేడపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన పెందుర్తి అయ్యప్ప కాలనీ సమీపంలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నక్కపల్లి మండలం డొంకాడ గ్రామానికి చెందిన ప్రగడ రమణ, సత్యవతి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తమ కుమారుడు ప్రగడ సందీప్‌(14)ను పెందుర్తి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో ఉంటున్న అమ్మమ్మ సూర్యకాంతం ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. సందీప్‌ స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కాగా రెండు రోజులుగా పాఠశాలకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోతున్నాడు. మూడవ రోజైన మంగళవారం కూడా పాఠశాలకు వెళ్లకపోవడంతో ఆ బాలుడిని అమ్మమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలుడు మూడో అంతస్థు నుంచి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కేజీహెచ్‌కి తరలించారు. ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ కాళ్లు, చేతులు విరిగిపోయాయని, ఉదర భాగానికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-12-01T04:21:43+05:30 IST