కామ్‌గా.. కాలేజీకి..!

ABN , First Publish Date - 2022-06-10T17:13:31+05:30 IST

రాష్ట్రంలో హిజాబ్‌ వివాదం క్రమేపీ తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముస్లిం నేతల విజ్ఞప్తుల ఫలితంగా కోస్తా ప్రాంతమైన

కామ్‌గా.. కాలేజీకి..!

- హిజాబ్‌ నేపథ్యంలో ప్రశాంతంగా ప్రారంభమైన పీయూ కళాశాల తరగతులు 

- బురఖా లేకుండానే హాజరైన ముస్లిం విద్యార్థినులు..పెరిగిన అడ్మిషన్లు

- హైకోర్టు తీర్పును అందరూ గౌరవించాల్సిందే

- ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదు: విద్యాశాఖ మంత్రి నాగేష్‌


బెంగళూరు, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హిజాబ్‌ వివాదం క్రమేపీ తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముస్లిం నేతల విజ్ఞప్తుల ఫలితంగా కోస్తా ప్రాంతమైన దక్షిణకన్నడ, ఉడుపి జిల్లాల్లోని అనేక కళాశాలల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. హిజాబ్‌ లేకుండా తరగతి గదులకు హాజరయ్యేందుకు ముస్లిం విద్యార్థినులు ముందుకొస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పీయూ కళాశాలలు గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎక్కడా ఎలాంటి వివాదాలు లేకుండా తొలిరోజు ప్రశాంతంగా జరగడం సంతోషంగా ఉందని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ వెల్లడించారు. హైకోర్టు తీర్పును అందరూ గౌరవించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. హిజాబ్‌ను నిషేధిస్తూ ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని వీటిని ఉల్లంఘించిన వారికి కళాశాలల్లోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలే ఈ వివాదాన్ని రాజకీయం చేయాలని చూశాయని, తమ ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా పరిస్థితి శాంతించిందన్నారు. ముస్లిం విద్యార్థినుల విద్యాభ్యాసానికి బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. నిజానికి ఉన్నత విద్యారంగంలో మైనారిటీలు రాణించేందుకు కేంద్రం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. మరోవైపు హిజాబ్‌ వివాదం ప్రారంభమైన ఉడుపి ప్రభుత్వ కళాశాలలో ప్రస్తుత ఏడాది ముస్లిం విద్యార్థినుల అడ్మిషన్‌ల సంఖ్య మరింతగా పెరుగుతుండడం గమనార్హం. ఈ ఏడాదైనా చదువు సాపీగా సాగాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.



Updated Date - 2022-06-10T17:13:31+05:30 IST