డిప్లొమా పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థుల నిరసన
ABN , First Publish Date - 2020-09-20T09:13:31+05:30 IST
ప్రస్తుత పరిస్థితుల్లో డిప్లొమా పరీక్షలను నిర్వహిస్తే విద్యార్థులు కరోనా బారినపడతారని, అందువల్ల ఈ పరీక్షలను రద్దు చేయాలని డీవైౖఎఫ్ ప్రతినిధి
ర్యాలీకి యత్నించిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆశీల్మెట్ట, సెప్టెంబరు 19: ప్రస్తుత పరిస్థితుల్లో డిప్లొమా పరీక్షలను నిర్వహిస్తే విద్యార్థులు కరోనా బారినపడతారని, అందువల్ల ఈ పరీక్షలను రద్దు చేయాలని డీవైౖఎఫ్ ప్రతినిధి ప్రభుదాస్ డిమాండ్ చేశారు. డిప్లొమా పరీక్షలను రద్దు చేసి, వాటిని నిర్వహించకుండానే విద్యార్థులను ప్రమోట్ చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు లక్షా 20 వేల మంది డిప్లొమా పరీక్షలు రాయాల్సి ఉందని, కరోనా దృష్ట్యా ఈ పరీక్షలను రద్దు చేయాలన్నారు. కాగా నిరసనలో భాగంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరగడంతో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శాంతియుతంగా నిరసన చేపట్టిన వారిపై పోలీసులిలా ప్రవర్తించడం సరికాదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు పవన్, యూఎస్ఎన్ రాజు, ఎం.రోషణ్, యశ్వంత్, ఆర్.సుధ తదితరులు పాల్గొన్నారు.