సౌదీలో రాబోయే రోజుల్లో.. కరోనా కల్లోలం ఖాయమంటున్న పరిశోధకులు
ABN , First Publish Date - 2020-04-09T14:20:27+05:30 IST
గల్ఫ్ దేశాల్లో మహమ్మారి కరోనావైరస్ విరుచుకుపడుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలో కొవిడ్-19 ప్రభావం తీవ్రంగా ఉంది.
రియాధ్: గల్ఫ్ దేశాల్లో మహమ్మారి కరోనావైరస్ విరుచుకుపడుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలో కొవిడ్-19 ప్రభావం తీవ్రంగా ఉంది. సౌదీలో మంగళవారం నాటికి 2,795 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 41 మంది మరణించారు. మరో 641 మంది కోలుకున్నారు. ఇదిలాఉంటే మంగళవారం నాడు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి తౌఫీక్ అల్ రబియా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే కొన్ని వారాల్లో సౌదీలో కరోనా బాధితులు గణనీయంగా పెరగనున్నారని వెల్లడించారు. అక్కడి కొన్ని పరిశోధన సంస్థల అంచనాల ప్రకారం 10 వేల నుంచి 2 లక్షల వరకు కరోనా కేసులు పెరుగుతాయని తెలిపారు. కాగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న ఆంక్షలు, కఠిన చర్యల కారణంగా కరోనా బాధితులు పెరిగే అవకాశం లేదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కానీ, ఆంక్షలను బేఖాతరు చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, పరిశోధకుల అంచనాలు కూడా నిజమయ్యే అవకాశం ఉందని తౌఫీక్ హెచ్చరించారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రజలు తప్పని సరిగా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం పాటించడంతోనే ఈ మహమ్మరిని అరికట్టగలమని ఆయన స్పష్టం చేశారు.. కాగా, కరోనాపై పోరాటానికి సౌదీ సర్కార్ ఇప్పటికే 15 బిలియన్ సౌదీ రియాల్స్(రూ. 302,990,625,000) ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఈ భారీ మొత్తాన్ని ఔషధాలు, కరోనా చికిత్సకు ఉపయోగించి పరికరాలు, వెంటిలేటర్స్, టెస్టింగ్ కిట్ల కొనుగోలుకు ఉపయోగించనున్నారు. అలాగే అదనపు వైద్య సిబ్బంది, టెక్నికల్ సిబ్బందిని సైతం సౌదీ ప్రభుత్వం ఇప్పటికే రెడీ చేసిందని మంత్రి తౌఫీక్ అల్ రబియా వెల్లడించారు.