ప్రారంభానికి నోచుకోని ఆరోగ్య ఉపకేంద్రం
ABN , First Publish Date - 2021-05-14T05:46:02+05:30 IST
మండలంలోని ఏజనీ గ్రామమైన రేగళ్లపాడు సత్తుపల్లికి సుమారు 17కిలోమీటర్ల దూరం ఉంటుంది.
రేగళ్లపాడులో ఏళ్ల తరబడి నిరూపయోగంగా..
కొవిడ్ సెంటర్గా మార్చండి: సర్పంచ్
సత్తుపల్లిరూరల్, మే13: మండలంలోని ఏజనీ గ్రామమైన రేగళ్లపాడు సత్తుపల్లికి సుమారు 17కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొన్నేళ్ల క్రితం ఇక్కడి గిరిజనులకు ఆరోగ్య అవసరాలను గుర్తించిన భద్రాచలం ఐటీడీఏ అధికారులు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని రూ.లక్షలు వెచ్చించి నిర్మించారు. అయితే ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడటం, ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగా ఏర్పాటు చేయడంతో ఈ కేంద్ర ప్రారంభానికి నోచుకోలేదు. సత్తుపల్లి, గంగారం ఆసుపత్రులకు బుగ్గపాడు మీదుగా చేరుకోవాలంటే దూరమవుతుండటంతో దగ్గర్లోని అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రానికి వెళ్తుంటారు. అయితే పక్కనే ఉన్న యాతాలకుంట గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రం కూడా మూతపడే ఉంది. దీంతో ఆరోగ్య అవసరాల కోసం ఏఎన్ఎం, ఆశా వర్కర్ వచ్చేంత వరకు గ్రామస్థులు ఇబ్బందులు తప్పడం లేదు.
పంచాయతీ కార్యాలయంగా మార్చండి..
అయితే ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటు చేయడానికి ఇబ్బందులు ఉన్నట్లయితే నూతనంగా ఏర్పడిన గ్రామానికి పంచాయతీ కార్యాలయంగా మార్చాలని సర్పంచ్ వాంకుడోతు విజయ కోరుతున్నారు. ఇదే విషయమై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కలసిన కోరినట్లు పంచాయతీ సెక్రటరీ పొట్లపల్లి దినేష్ తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రేగళ్లపాడుతో పాటు యాతాలకుంట, చంద్రాయపాలెం గ్రామాలకు కలసి కొవిడ్ సెంటర్గా మార్చవచ్చునని పలువురు అంటున్నారు.