మహిళతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్‌ఐ కేసులో తాజా అప్డేట్

ABN , First Publish Date - 2021-06-06T12:52:56+05:30 IST

కీసరలోని ఓ రిసార్టులో మహిళతో రాసలీలలు జరిపిన

మహిళతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్‌ఐ కేసులో తాజా అప్డేట్

  • రాసలీలల ఎస్‌ఐని సస్పెండ్‌ చేసిన సీపీ


హైదరాబాద్‌ సిటీ : కీసరలోని ఓ రిసార్టులో మహిళతో రాసలీలలు జరిపిన జవహర్‌నగర్‌ ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేసినట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ శనివారం తెలిపారు. విచారణలో ఎస్‌ఐ బాగోతం నిజమేనని తేలడంతో ఆయనపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.


ఇష్టానుసారంగా సిబ్బంది పనితీరు.. 

జవహర్‌నగర్‌ పీఎస్‌లో ఎస్‌హెచ్‌వోగా పనిచేసిన తిరుపతిరావు గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఓ కబ్జా బాగోతం గొడవలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎస్‌హెచ్‌వో పోస్టు ఖాళీగా ఉండటంతో డీఐ మధుకుమార్‌కు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. మధుకుమార్‌ మాటను కొంతమంది సిబ్బంది పెడచెవిన పెడుతున్నారు. విధినిర్వహణలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ పోలీస్‌ స్టేషన్‌ పరువు తీస్తున్నారు. తాజాగా ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌ రాసలీలల బాగోతం వెలుగులోకి రావడంతో సీపీ మహేష్‌ భగవత్‌ సిబ్బందిపై సీరియస్‌ అయ్యారు. ఆదర్శంగా ఉండాల్సిన ఎస్‌ఐ దారితప్పడం, మరికొంతమంది సిబ్బంది ఇష్టానుసారంగా ప్రవర్తించి పోలీస్‌ పరువు తీస్తున్నారంటూ మండిపడ్డారు.


సెటిల్‌మెంట్లు దందాలు.. 

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో భూ కబ్జాల గొడవలు, పంచాయితీలు, గొడవలు కొట్లాటలు నిత్యకృత్యంగా ఉంటాయి. ఎస్‌హెచ్‌వో పర్యవేక్షణ లేకపోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది కేసులను నీరుగారుస్తున్నారు. ఎవరికి వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. సస్పెండైన ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌ దందాలు, సెటిల్‌మెంట్‌లు అధికంగా ఉండేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అతనితో పాటు పనిచేస్తున్న మరో ఎస్‌ఐపై భూ కబ్జాలు, సెటిల్‌మెంట్ల ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అతను కూడా కబ్జాకోరులతో కుమ్మక్కై ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి స్టేషన్‌ను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2021-06-06T12:52:56+05:30 IST