సత్ప్రవర్తనతోనే సాఫల్యం
ABN , First Publish Date - 2021-01-01T06:25:57+05:30 IST
ధన వ్యామోహం మనిషిని పతనం వైపు వేగంగా నడిపిస్తుంది. ధనం కన్నా నీతి నిజాయతీ, మంచి నడవడిక ఉన్నవారు ఉత్తమ ఫలితాలను పొందుతారనేది దైవ
ధన వ్యామోహం మనిషిని పతనం వైపు వేగంగా నడిపిస్తుంది. ధనం కన్నా నీతి నిజాయతీ, మంచి నడవడిక ఉన్నవారు ఉత్తమ ఫలితాలను పొందుతారనేది దైవ ప్రవక్త ఇచ్చిన దివ్య సందేశం. సిరి సంపదల కోసం, అధికారం కోసం, హోదాల కోసం వెంపర్లాడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. కానీ ఇవేవీ మానవుడి గౌరవానికీ, ఔన్నత్యానికీ, శక్తికీ, సామర్థ్యానికీ కొలమానాలు ఏమాత్రం కావు. కోట్ల ఆస్తులు ఉన్నా సత్ప్రవర్తన, నిజాయతీ లేకపోతే ఎవరికీ గౌరవ మర్యాదలు లభించవు.
నీతి నిజాయతీలు, ఉత్తమైన నడవడికతో పాటు దైవ భీతి, దైవ భక్తి ఉన్నవారు గౌరవనీయమైన స్థానం పొందుతారు. అవి కలిగినవారే పరిపూర్ణ విశ్వాసులనీ, సత్ప్రవర్తన కలిగిన వారే మానవుల్లో అందరికన్నా ఉత్తములనీ దైవ ప్రవక్త మహమ్మద్ స్పష్టం చేశారు. ప్రళయ దినాన విశ్వాసి కర్మల త్రాసులో తూచే వస్తువుల్లో అత్యంత బరువైనది అతని నైతికతేనని పేర్కొన్నారు.
ఒకసారి ప్రవక్తను ఆయన అనుచరులు ‘‘దైవ ప్రవక్తా! మానవుడికి దైవం అనుగ్రహించిన వాటిలో అన్నిటికన్నా ఉత్తమైనదేమిటి?’’ అని ప్రశ్నించారు.
‘‘మంచి నడవడిక (సత్ప్రవర్తన)’’ అని ప్రవక్త బదులిచ్చారు.
దైవభీతి, సద్గుణాలు స్వర్గ ప్రవేశానికి ఎక్కువగా దోహదకారులవుతాయని హదీస్ గ్రంథం చెబుతోంది. ఎంతటి దైవ భక్తులైనా, ఎన్ని ఆరాధనలూ, పూజలూ చేసినా... వారిలో నీతి నిజాయతీలు, మంచి ప్రవర్తన లేకపోతే ఆ భక్తి ప్రపక్తులన్నీ వృథా అవుతాయి. అందుకే, దైవారాధన (నమాజ్), దాన ధర్మాలతో పాటు నైతిక ప్రవర్తన కూడా కలిగి ఉండాలనీ, మంచి పనులు చేయాలనీ పవిత్ర ఖుర్ఆన్ పదే పదే ఉపదేశించింది. సదాచరణ, సత్ప్రవర్తన ఉన్నవారికి దైవం తోడుగా ఉంటాడు. వారికి సిరి సంపదలు చేకూరుస్తాడు. జీవన సాఫల్యానికి మార్గం సుగమం చేస్తాడు.
ఫ మహమ్మద్ వహీదుద్దీన్