హాథ్రస్ బాధితురాలిపై బీజేపీ నేత షాకింగ్ వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-10-07T14:24:54+05:30 IST
హాథ్రస్ బాధితురాలిపై బీజేపీ నాయకుడు రంజిత్ బహదూర్ శ్రీవాస్తవ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
యువతికి నిందితుడితో సంబంధం ఉందని ఆరోపణ
బారాబంకీ (ఉత్తరప్రదేశ్): హాథ్రస్ బాధితురాలిపై బీజేపీ నాయకుడు రంజిత్ బహదూర్ శ్రీవాస్తవ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.హాథ్రస్ బాధిత యువతికి నిందితుడితో సంబంధం ఉందని,నేరం జరిగిన రోజు యువతే నిందితుడిని మొక్క జొన్న చేనుకు పిలిచిందని బీజేపీ నేత రంజిత్ ఆరోపించారు. 19 ఏళ్ల దళిత యువతిని సామూహిక అత్యాచారం చేసిన ఉన్నత కులానికి చెందిన నలుగురు నిందితులు అమాయకులని, బాధిత యువతి అవారా అని రంజిత్ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. తనపై 44కి పైగా క్రిమినల్ కేసులున్న వివాదాస్పద బీజేపీ నేత రంజిత్ బహదూర్ శ్రీవాస్తవ హాథ్రస్ కేసుపై షాకింగ్ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది.
హాథ్రస్ కేసులో నిందితులు నిర్దోషులని బీజేపీ నేత చెప్పారు. కాగా హాథ్రస్ బాధితురాలిపై ఆరోపణలు చేసిన బీజేపీ నేత శ్రీవాస్తవకు జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖాశర్మ నోటీసు పంపుతానని చెప్పారు. గతంలో శ్రీవాస్తవ సీతాపూర్, లక్నో, యూపీలో పలు మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై 44 క్రిమినల్ కేసులు నమోదైనాయి.
సోషల్ మీడియాలో వైరల్ అయిన శ్రీవాస్తవ వీడియోలో బాధితురాలు నిందితుడిని ప్రేమించినందున ఆమె అతన్ని పొలాల్లోకి పిలిచిందని ఆరోపించారు. అవారా యువతులు చెరకు, మొక్కజొన్న, జొన్న పొలాల్లో పొదలు, అడవుల్లో మరణిస్తూ కనిపిస్తుంటారని ఆయన ఆరోపించారు. హాథ్రస్ నిందితులను సీబీఐ చార్జిషీటు దాఖలు చేసే వరకూ జైలు నుంచి విడుదల చేయాలని శ్రీవాస్తవ కోరారు.