ఆదేశాలు బేఖాతరు చేస్తే చర్యలు తప్పవు
ABN , First Publish Date - 2020-05-21T10:05:29+05:30 IST
కరోనా లాక్డౌన్లో సడలింపు ఇచ్చిన ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల నిర్వహణలో పలు ఆదేశాలను జారీ చేసిందని, వాటిని బేఖాతరు చేస్తే కఠిన
మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మంలో బస్సుల ఆకస్మిక తనిఖీ
కోదాడ డిపో మేనేజర్ సస్పెన్షన్కు ఆదేశం
శానిటైజర్ ఇవ్వలేదని గుర్తించి ఆగ్రహం
ఖమ్మం ఎడ్యుకేషన్, మే 20: కరోనా లాక్డౌన్లో సడలింపు ఇచ్చిన ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల నిర్వహణలో పలు ఆదేశాలను జారీ చేసిందని, వాటిని బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హెచ్చరించారు. బుధవారం ఖమ్మం బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ప్లాట్ఫాంపై ఉన్న సూర్యాపేట జిల్లా కోదాడ డిపోకు చెందిన బస్సులోకి ఎక్కి.. కరోనా నియంత్రణ చర్యల గురించి కండక్టర్ను అడిగారు. అయితే తనకు డిపోలో శానిటైజర్ ఇవ్వలేదని ఆ కండక్టర్ సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. సెల్ఫోన్లో నల్గొండ ఆర్ఎంతో మాట్లాడారు. కండక్టర్కు ఎందుకు శానిటైజర్ ఇవ్వలేదని, అందుకు కారకుడైన కోదాడ డిపో మేనేజర్ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో అన్ని బస్సుల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చామని, తమ ఆదేశాలను పట్టించుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బస్సుల్లో ప్రయాణించేవారు ఖచ్చితంగా మాస్క్లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రయాణికులకు సూచించారు. అలాగే మాస్కులు ధరించినవారినే బస్సుల్లోకి అనుమతించాలని డ్రైవర్లకు, కండక్టర్లను ఆదేశించారు. ప్రతీ డిపోలో కండక్టర్కు తప్పని సరిగా శానిటైజర్ ఇవ్వాలని, ప్రయాణికులు చేతులు శానిటైజ్ చేసుకున్నాకే టికెట్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
అలాగే బస్టాండ్లలో వేచిచూసే సమయంలోనూ భౌతిక దూరం పాటించి కూర్చోవాలని, అందుకు అనుగుణంగా ఆవరణలోని సీట్లను ప్రత్యేంగా ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కార్పొరేషన్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఆర్ఎం. కృష్ణమూర్తి, డివీఎం.సుగుణాకర్, డీఎం.శివశంకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.