డాక్టర్ సుధాకర్‌ ఒంటిపై చేయి వేసినవాళ్లను జైలులో పెట్టాలి: సుధాకర్‌ తల్లి

ABN , First Publish Date - 2020-05-27T22:54:37+05:30 IST

డాక్టర్ సుధాకర్‌ ఒంటిపై చేయి వేసినవాళ్లను జైలులో పెట్టాలని సుధాకర్‌ తల్లి కావేరిబాయి డిమాండ్ చేశారు. తన కుమారుడు మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

డాక్టర్ సుధాకర్‌ ఒంటిపై చేయి వేసినవాళ్లను జైలులో పెట్టాలి: సుధాకర్‌ తల్లి

విశాఖ: డాక్టర్ సుధాకర్‌ ఒంటిపై చేయి వేసినవాళ్లను జైలులో పెట్టాలని సుధాకర్‌ తల్లి కావేరిబాయి డిమాండ్ చేశారు. తన కుమారుడు మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సుధాకర్‌ స్వహస్తాలతో లేఖ రాశారని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్న సుధాకర్‌పై మానసిక రోగంటూ ముద్ర వేశారని, తన కుమారుడు శారీరకంగా చాలా నీరసించారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు నుంచి అన్నివర్గాల నుంచి మద్దతు ఉన్నా... ప్రభుత్వం నుంచి మద్దతు రావడంలేదని తప్పుబట్టారు. సుధాకరన్‌ను కావాలనే వేధిస్తున్నారని, సుధాకర్‌ చాలా చిక్కిపోయాడని, ఆరోగ్యం క్షీణించిందని వాపోయారు. సుధాకర్‌ను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చేందుకు అనుమతి ఇవ్వాలని కావేరిబాయి కోరారు.


అంతకుముందు మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సుధాకర్‌ లేఖ రాశారు. మాస్కుల విషయం నుంచి అన్ని అంశాలను లేఖలో ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఉన్న తనకు మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారని వెల్లడించారు. తనకు ఏ రోజు ఏ మందులు ఇచ్చారో లేఖలో పేర్కొన్నారు. ఈ మందుల వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయని సుధాకర్ వాపోయారు. పెదవిపై వచ్చిన మార్పులు చూపిస్తూ ఫొటోలు విడుదల చేశారు. యూరిన్‌ సమస్య కూడా ఉందని లేఖలో తెలిపారు. తనను వెంటనే వేరే ఆస్పత్రికి రిఫర్‌ చేయాలని సుధాకర్‌ విజ్ఞప్తి చేశారు. తన మానసిక స్థితి సరిగానే ఉందని లేఖలో సుధాకర్ పేర్కొన్నారు.

Updated Date - 2020-05-27T22:54:37+05:30 IST