మింగేసిన కరోనా భయం!
ABN , First Publish Date - 2021-05-15T09:43:07+05:30 IST
కరోనా భయం మూడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వైరస్ సోకిందన్న భయంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరం జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.
ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
వేపాడ, మే 14: కరోనా భయం మూడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వైరస్ సోకిందన్న భయంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరం జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వేపాడ మండలం నల్లబిల్లి గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ గుప్త (62), చాలా ఏళ్లు కిందట ఉపాధి నిమిత్తం కుటుంబంతో గుంటూరు వెళ్లిపోయారు. కుమారుడు, కుమార్తెలకు వివాహాలు చేశారు. వారు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. రెండేళ్ల కిందట సత్యనారాయణ గుప్త విశాఖ జిల్లా చోడవరానికి మకాం మార్చారు. బుధవారం ఆయన అనారోగ్యానికి గురయ్యారు. కరోనా లక్షణాలున్నాయని.. పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్ సూచించారు.
ఈ నేపథ్యంలో భార్య సత్యవతి (57), అత్త సుబ్బలక్ష్మి (75)తో కలిసి శుక్రవారం ఉదయం స్వగ్రామానికి వచ్చారు. బంధువులు, మిత్రులను కలిసి ఆత్మీయంగా మాట్లాడారు. తిరిగి చోడవరం వెళ్తున్నామని చెప్పి బయల్దేరారు. కానీ గ్రామంలోని శివాలయం సమీపంలోకి వచ్చి ముందుగానే తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. అనంతరం బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.