పోలీసులు అరెస్ట్ చేస్తారని భయం
ABN , First Publish Date - 2021-11-20T04:38:46+05:30 IST
ఓ కేసులో నిందితుడిగా ఉన్న తనను పోలీసులు అరెస్ట్ చేస్తారేమోననే భయంతో ఓ వ్యక్తి బుధవారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ఖమ్మం క్రైం, నవంబరు 19: ఓ కేసులో నిందితుడిగా ఉన్న తనను పోలీసులు అరెస్ట్ చేస్తారేమోననే భయంతో ఓ వ్యక్తి బుధవారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈసంఘటన గురువారం రాత్రి ఖమ్మం నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని యూపీహెచ్ కాలనీకి చెందిన పిల్లిగుంట శ్రీనివాస్ (32) ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. ఇతడు గతంలో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండి భద్రాచలం, ఖమ్మంలో జైలుకు వెళ్లి వచ్చాడు. అయితే గత నెల 22న దానవాయిగూడేనికి చెందిన ఓమహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి పలువురు కారణం అని పోలీసులకు తెలిసింది. ఈ సంఘటనపై ఖానాపురం హవేలీ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో శ్రీనివాస్ కూడా ఉన్నాడని తెలిసింది. అతడిని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో అతడు ఇంటి వద్ద లేడని, కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలం గుడికి వెళ్లాడని తెలిసింది. భద్రాచలం నుంచి తిరిగి బుధవారం వచ్చే దారిలో శ్రీనివాస్కు ఆయన భార్యకు గొడవ జరిగింది. దీంతో కొణిజర్ల సమీపంలోకి వచ్చాక ఆటోలో ముందుగానే ఉన్న పురుగులమందు డబ్బాను తీసుకుని తాగాడు. నగర పరిధిలోని శ్రీశ్రీ సర్కిల్ వద్దకు వచ్చాక వాంతులు కావడంతో అతడి భార్య నిలదీయడంతో పురుగుల మందు తాగానని చెప్పడంతో వెంటనే అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. మృతుడి భార్య సుజాత పిర్యాదు మేరకు ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేశారు.