నమ్మించి మోసంచేశారని దంపతుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-07-31T08:17:22+05:30 IST

తాము ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలిప్పిస్తామని ఆ ముగ్గురు చెబితే ఆయన నమ్మాడు. తనకు తెలిసినవారికి ఈ విషయం చెప్పి.. వారి నుంచి రూ.80 లక్షలు వసూలు చేసి ముగ్గురి

నమ్మించి మోసంచేశారని దంపతుల ఆత్మహత్య

యువతకు ఉద్యోగాలిప్పిస్తామని చెప్పిన ముగ్గురు పరిచయస్తులు 

80 లక్షలు వసూలు చేసి ఇచ్చిన భర్త 

ఉద్యోగాలు ఇవ్వకపోవడమేకాక చంపుతామంటూ బెదిరింపులు

డబ్బు ఇచ్చిన యువతకు ముఖం చూపించలేక పురుగుల మందు సేవనం

సెల్ఫీ వీడియోలో మరణ వాంగ్మూలం  


పరకాల, జూలై 30: తాము ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలిప్పిస్తామని ఆ ముగ్గురు చెబితే ఆయన నమ్మాడు. తనకు తెలిసినవారికి ఈ విషయం చెప్పి.. వారి నుంచి రూ.80 లక్షలు వసూలు చేసి ముగ్గురి చేతుల్లో పెట్టాడు. నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు రాలేదు. తనకు డబ్బు ఇచ్చినవారికి ముఖం చూపలేక చావే శరణ్యమనుకున్న ఆ వ్యక్తి, భార్యతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.  తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారిద్దరూ మానసిక వికలాంగులు కావడం హృదయాలను కలిచివేస్తోంది. సీఐ మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు.. వరంగల్‌ రూరల్‌ జిల్లా పొనకల్‌కు చెందిన తాళ్లపెళ్లి కేశవస్వామి (53), సంధ్యారాణి (45). వీరికి నిఖిల్‌ సాయివర్దన్‌, చందన పిల్లలు.


పదిహేనేళ్ల క్రితం కేశవస్వామి కుటుంబం హన్మకొండకు వలసవెళ్లింది. అక్కడి నుంచి ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్‌కు మారాడు. రెండేళ్ల క్రితం హన్మకొండకు వచ్చి ఓ ఎరువుల కంపెనీలో పనికి చేరాడు. ఈ క్రమంలో ఆయనకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో పని చేస్తున్న పుల్ల బాబు, కాంట్రాక్టర్‌ వాలునాయక్‌, గాడిపెల్లి వెంకటేశ్వర్లుతో పరిచయం ఏర్పడింది. ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని విద్యుత్తు శాఖలో కంప్యూటర్‌ ఆపరేటర్‌, అటెండర్‌, సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిన ఇప్పిస్తామంటూ కేశవస్వామికి వారు చెప్పారు. నమ్మిన ఆయన తనకు తెలిసిన పలువురికి ఈ ఉద్యోగాల విషయం తెలిపి వారి నుంచి రూ.80 లక్షలు వసూలు చేశాడు. బ్యాంకు ద్వారా పుల్ల బాబుకు రూ.40 లక్షలు, వెంటేశ్వర్లుకు రూ.17 లక్షలు, నాయక్‌కు రూ. 3.24 లక్షలు బదిలీ చేశాడు. మిగతా డబ్బును వారికే నగదు రూపంలో ఇచ్చాడు.


అయితే నెలలు గడుస్తున్నా.. ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు కేశవస్వామిపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని ఆయన,  పుల్ల బాబు, వాలునాయక్‌, వెంకటేశ్వర్లుకు చెప్పగా రేపు మాపు అంటూ వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరకు గట్టిగా అడగడంతో ముగ్గురూ రివర్స్‌ అయి చంపుతామని ఆయన్ను బెదిరించారు. వారి తీరుతో ఆయన మనస్తాపం చెందాడు.  డబ్బు ఇచ్చినవారికి ముఖం చూపలేక ఇబ్బంది పడ్డాడు. భర్త పరిస్థితిని గమనించిన భార్య సంధ్యారాణి కూడా మనస్తాపం చెందింది. తమకు చావే శరణ్యమని ఇద్దరూ భావించారు. తాను మోసోయిన తీరును కేశవస్వామి భార్యా పిల్లలతో కలిసి సెల్ఫీ వీడియోలో రికార్డు చేశాడు.  సూసైడ్‌ వీడియోను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి పరిగణనలోకి తీసుకొని తనను మోసం చేసిన ముగ్గురిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని నిరుద్యోగులకు డబ్బులు ఇప్పించాలని వేడుకున్నాడు. తమ అస్థికలను భద్రాద్రి వద్ద నదిలో కలపాలని కోరాడు. 


చర్చిలో ప్రార్థనలు చేసి...

బుధవారం కేశవస్వామి, సంధ్యారాణి దంపతులు ఇద్దరు పిల్లలను తీసుకొని పరకాలలోని సీఎ్‌సఐ చర్చికి వచ్చారు. రోజంతా ప్రార్థనలు చేశారు. అనంతరం చర్చి సమీపంలో బస చేశారు. గురువారం రాత్రి సంధ్యారాణి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగింది. గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కేశవస్వామి ఆస్పత్రికి చేరుకుని భార్య తాగి వదిలేసిన పురుగుల మందును తాగాడు. అక్కడే ఉన్న డాక్టర్లు ఆయనకు ప్రథమ చికిత్స చేసి వరంగల్‌ ఎంజీఎంకు పంపారు. మార్గంమధ్యలోనే కేశవస్వామి కన్నుమూశాడు. 


ఏం జరిగిందో  తెలియని స్థితిలో పిల్లలు.. 

గత బుధవారం  కేశవస్వామి, సంధ్యారాణి దంపతులు ఇద్దరు పిల్లలను తీసుకొని పరకాలలోని సీఎ్‌సఐ చర్చికి వచ్చారు. రోజంతా అక్కడే ఉండి ప్రార్థనలు చేశారు. అనంతరం చర్చి సమీపంలో బస చేశారు. గురువారం రాత్రి సంధ్యారాణి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగింది. గమనించిన స్థానికులు 108 అంబులెన్‌సలో పభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కేశవస్వామి ఆస్పత్రికి చేరుకుని భార్య తాగి వదిలేసిన పురుగుల మందును తాగాడు. అక్కడే ఉన్న డాక్టర్లు ఆయనకు ప్రథమ చికిత్స చేసి వరంగల్‌ ఎంజీఎంకు పంపారు. అయితే మార్గంమధ్యలోనే కేశవస్వామి కన్నుమూశాడు. మృతదేహాలను పరకాలకు తీసుకొచ్చి పోస్టుమార్టం చేశారు. పరకాలలోని చలివాగు ఒడ్డున పోలీసులే దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు.  దంపతుల ఆత్మహత్యతో ఇద్దరు పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జరిగింది ఏమిటో వారికి తెలియడం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే సంబంధం లేని మాటలతో జవాబు ఇస్తున్నారు. ఇద్దరి పరిస్థితిని చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. వారికి ప్రభుత్వం ఆశ్రయం కల్పించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.   

Updated Date - 2021-07-31T08:17:22+05:30 IST