చార్టర్డ్ అకౌంటెంట్ దంపతుల ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-27T08:47:58+05:30 IST
చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) దంపతుల ఆత్మహత్య పాలమూరులో కలకలం రేపింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్నగర్ మండలం ధర్మాపూర్ గ్రామానికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ నర్సింహారెడ్డి(54), లత(48) దంపతులు పాలమూరులో స్థిరపడ్డారు.
- పాలమూరులో కలకలం
మహబూబ్నగర్, అక్టోబరు 26 : చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) దంపతుల ఆత్మహత్య పాలమూరులో కలకలం రేపింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్నగర్ మండలం ధర్మాపూర్ గ్రామానికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ నర్సింహారెడ్డి(54), లత(48) దంపతులు పాలమూరులో స్థిరపడ్డారు. మధురానగర్ కాలనీలో ఉంటున్న నర్సింహారెడ్డి పట్టణంలోని వైడి గుప్త ట్రేడర్స్తో పాటు పలువురికి సీఏగా పనిచేస్తున్నారు. భార్య గృహిణి. వీరికి కుమారుడు, కూమార్తె ఉన్నారు. కుమారుడు మూడు నెలల క్రితమే కెనడా వెళ్ళారు. కుమార్తె సుష్మ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. కూతురు జిమ్ కోసం మంగళవారం ఉదయం 7:40 గంటలకు బయటకు వెళ్ళి 8:30 గంటలకు తిరిగి ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరూ హాల్లో కిటికీకి బట్టలతీగతో ఉరేసుకుని ఉండటం చూసి ఖంగుతింది. రోదిస్తూ చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు వచ్చి కిందకు దించేటప్పటికే దంపతులు ఇద్దరూ చనిపోయి ఉన్నారు. విషయం పోలీసులకు చేరవేయడంతో రూరల్ ఎస్సై రమేశ్, ఏఎస్సై సుజాత ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కుమారుడు కెనడా నుంచి బుధవారం రానుండటంతో మృతదే హాలను జనరల్ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
ఆర్థికంగా స్థితిమంతులైనందున ఈ దంపతులు అనారోగ్యం వల్లేఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. పాలమూరులో మూడంతస్తుల ఇంటితో పాటు ధర్మాపూర్లో పొలాలు ఉన్నాయి. కొన్నాళ్లుగా దంపతులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, పెళ్ళికి వచ్చిన కొడుకు, కూతురుకు పెళ్ళి చేయాల్సిన సమయంలో ఆత్మహత్య చేసుకోవడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కుటుంబ సమస్యలు ఏమైౖనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కొడుకు వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. విషయం తెలిసి బంధువులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకొని విలపించారు.