అల్లుడే హత్య చేశాడు

ABN , First Publish Date - 2021-01-20T06:22:04+05:30 IST

అల్లుడు బాలాజీ కుమార్తె రేణుకను హత్య చేశాడని బి.కొత్తకోట మండలం యాలగిరివారిపల్లెకు చెందిన అంతరప్ప, శివమ్మ దంపతులు ఫిర్యాదు చేశారు

అల్లుడే హత్య చేశాడు
మృతిచెందిన రేణుక

మదనపల్లె క్రైం, జనవరి 19: అనుమానాస్పద స్థితిలో బి.కొత్తకోట మండలానికి చెందిన వివాహిత మృతిచెందింది. దీంతో అల్లుడే హత్య చేశాడని అత్తామామలు ఆరోపిస్తూ మంగళవారం మదనపల్లె తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు.. బి.కొత్తకోట మండలం యాలగిరివారిపల్లెకు చెందిన అంతరప్ప, శివమ్మ దంపతుల కుమార్తె రేణుక(24)కు, మదనపల్లె మండలం మొలకలదిన్నెక్రా్‌సకు చెందిన జె.బాలాజీతో మూడేళ్ల కిందట వివాహమైంది. బాలాజీ కారుడ్రైవర్‌గా పనిచేస్తుండగా, రేణుక కూలి పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మొలకలదిన్నెక్రాస్‌ సమీపంలోని హంద్రీ-నీవా కాలువలో అపస్మారకస్థితిలో రేణుక పడిఉండడం స్థానికులు గుర్తించి జిల్లా వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు పేర్కొనడంతో, బాలాజీ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు రేణుక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని, అక్కడున్న బాలాజీని చితకబాదారు. అనంతరం తాలూకా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో మంగళవారం ఉదయం భార్య రేణుక దుస్తులు ఉతికేందుకు హంద్రీ-నీవా కాలువ వద్దకు వెళ్లిందనీ, ఫిట్స్‌ రావడంతో నీళ్లలో పడి మృతిచెందినట్లు బాలాజీ వివరించాడు. అయితే అదనపు కట్నం కోసమే తమ కుమార్తెను కొట్టి చంపేశాడని మృతురాలి తల్లిదండ్రులు అంతరప్ప, శివమ్మ ఆరోపించారు. పెళ్లి సమయంలో అల్లుడికి 60గ్రాముల బంగారం, కారు కొనుక్కోవాలంటే ఏడాది కిందట రూ.రెండు లక్షల రుణం తీసుకుని మరీ ఇచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కట్నం కోసం పలుమార్లు కుమార్తెను బాలాజీ శారీరక హింసలకు గురిచేశాడన్నారు. ఈ విషయమై అలిగి పదిరోజుల కిందట పుట్టింటికి వచ్చిన రేణుకను ఐదురోజుల కిందట అల్లుడు కాపురానికి తీసుకెళ్లాడన్నారు. అంతలోనే తమ బిడ్డను కొట్టి చంపాడని భోరుమన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Updated Date - 2021-01-20T06:22:04+05:30 IST