ఉపాధికి ఎండదెబ్బ
ABN , First Publish Date - 2020-05-29T09:42:41+05:30 IST
ఉపాధి పనులకు ఎండదెబ్బ తగులుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి
మండుటెండల్లో పనులకు కూలీలు
పని ప్రదేశాల్లో కనీస వసతులు కరువు
కనిపించని టెంట్లు, మెడికల్ కిట్లు
బషీరాబాద్: ఉపాధి పనులకు ఎండదెబ్బ తగులుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. బషీరాబాద్ మండలంలో మొత్తం 36 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 461 శ్రమశక్తి సంఘాలు ఉండగా, జాబ్ కార్డులు 13,399 పైగా ఉన్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో సొంతూళ్లకు వచ్చిన వలస కూలీలు, యువకులు ఉపాధి పనులకు మొగ్గు చూపుతున్నారు. ప్రతిరోజూ ఆయా గ్రామాల్లో 7,450 మందికి పైగా కూలీలు పనులు చేస్తున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో చాలా మంది కూలీలు పనులు చేసేందుకు జంకుతున్నారు. పని చేసే చోట టెంట్లు, కూలీలు వడదెబ్బకు గురైతే అవసరమయ్యే మెడికల్ కిట్లు అందుబాటులో ఉండాలి.
కానీ అవేవి కానరావడంలేదు. కనీసం తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఇవ్వడం లేదని కూలీలు వాపోతున్నారు. లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయని చెబుతున్నారు. సౌకర్యాలు లేక ఎండ తీవ్రతకు పనులు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు.