‘ఏక్షామ్ చార్మినార్కే నామ్’లో మరిన్ని ఆకర్షణలు
ABN , First Publish Date - 2021-10-30T22:08:26+05:30 IST
పాతబస్తీ చార్మినార్ వద్ద ఆదివారం నిర్వహించే సన్ ఏ ఫన్ డేలో భాగంగా ‘ ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ మరింత సందడిగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసి అధికారులు కుడా అధికారులతో కలిసి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు
హైదరాబాద్: పాతబస్తీ చార్మినార్ వద్ద ఆదివారం నిర్వహించే సన్ ఏ ఫన్ డేలో భాగంగా ‘ ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ మరింత సందడిగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసి అధికారులు కుడా అధికారులతో కలిసి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. గత వారం కంటే ఈసారి మరిన్ని ఆకర్షణలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం పిల్లా పాపలతో హాయిగా ఎంజాయ్చేయాలనుకునే వారికి ఇక్కడి ఏర్పాట్లు మరింత ఆహ్లాదాన్నిఇస్తుందని చెబుతునారు. ఇప్పటికే టాంక్బండ్ పై సన్ డే ఫన్ డే పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పాతబస్తీలోనూ ఇలాంటి కార్యక్రమంలో నిర్వహించాలని ఇక్కడి ప్రజాప్రతినిధులు కోరవడంతో గత వారం నుంచే ఏక్ షామ్ చార్మినార్ కే నామ్ పేరుతో నిర్వహిస్తున్నారు.
ఈ ఆదివారం జరిగే కార్యక్రమాల్లో సూఫీ నైట్, బ్యాండ్ ఫెర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. ఇక వివిధ రకాల గేమ్స్ పిల్లలను ఆలరించనున్నాయి. అంతే కాకుండా టాటూ ఆర్టిస్టుల హడావిడి, మట్కాచాయ్ రుచులు, సాంప్రదాయ ఓల్డ్సిటీ వంటకాల రుచులు, వివిధ రకాల హ్యాండిక్రాఫ్ట్స్, ఆర్టిఫిషియల్ జ్యూయలరీ అమ్మకాలు కొనుగోలు దారులకు అందుబాటులో ఉండనున్నాయి. గత వారం లాగే ఈసారి కూడా తెలంగాణ పోలీస్ బ్యాండ్ అలరించనుంది. సూఫీ,గజల్స్ వంటివి కూడా నగర పౌరులకు ఆహ్లాదపరుస్తాయి. ఇక్కడికి వచ్చే వారికి ఉచితంగా మొక్కల పంపిణీ చేయనున్నారు.
గతవారం ఫుడ్ ఐటమ్స్కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈసారి కూడా రక రకాల నాన్వెజ్ వంటకాలు అలరించనున్నాయి. వాటితో పాటు రక రకాల స్నాక్స్, ఛాట్, ఐస్ క్రీమ్, డిజర్ట్స్ అందుబాటులో ఉంటాయి. షాపింగ్ ప్రియుల కోసం రక రకాల అలంకరణ, షోకేస్ వస్తువులు, జ్యూయలరీ, గాజులకు సంబంధించిన స్టాల్స్ కొలువు తీరనున్నాయి. కారికేచర్ ఆర్టిస్టులు, ఫేస్ పెయింటర్స్, టెంపరరీ టాటూ ఆర్టిస్టులు యువతను ఆకట్టుకోనున్నారు. సండే ఫన్డేలో సందడి చేసేందుకు వచ్చే వారికి మొబైల్ మరుగుదొడ్లు కూడా అందుబాటులో ఉంచనున్నారు.