ఎనిమిది నెలలుగా గదిలో వివాహిత బందీ... గ్రామస్తులు ఏం చేశారంటే....
ABN , First Publish Date - 2021-06-17T18:11:28+05:30 IST
బీహార్లోని సుపౌల్లో సమాజానికి తలవంపులు తెచ్చే...
సుపౌల్: బీహార్లోని సుపౌల్లో సమాజానికి తలవంపులు తెచ్చే ఉదంతం చోటుచేసుకుంది. సుపాల్ పరిధిలోని కిసాన్పూర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒక వివాహితురాలిని కట్నం కోసం ఎనిమిది నెలలుగా ఇంట్లో బందీ చేశారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియగానే వారు మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా పోలీస్ స్టేషన్ హెడ్ ప్రమీలా కుమారి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమెను బందీ చేసిన ఇంటి తాళం పగులగొట్టి ఆమెను బయటకు తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే కిసాన్పూర్కు చెందిన విక్రమ్ చౌదరి కుమారుడు సంజయ్ చౌదరికి ఢిల్లీలోని నోయిడాకు చెందిన యువతితో 2018 మార్చి 7 న వివాహం జరిగింది.
ఆ సమయంలో వరునికి వధువు తండ్రి కారుతో పాటు రూ. 17 లక్షలు కట్నంగా ఇచ్చారు. తరువాత ఆ దంపతులు కిసాన్పూర్లో కాపురం పెట్టారు. వారికి ఏడాదిన్న వయసుగల కుమార్తె కూడా ఉంది. అయితే కొంతకాలంగా అత్తామామలు మరో పది లక్షల రూపాయలు తీసుకురావాలని కోడలిని వేధించసాగారు. అమె వారు అడినంత మొత్తం తీసుకురాకపోవడంతో భర్త, అత్తామామలు కలిసి ఆమెను ఎనిమిది నెలలుగా గదిలో బంధించారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.