మేమూ మీ వెంటే
ABN , First Publish Date - 2022-01-29T08:44:25+05:30 IST
పీఆర్సీపై ఉద్యోగ సంఘాల జేఏసీ ఐక్యవేదిక చేస్తున్న ఉద్యమానికి ఏపీఎ్సఆర్టీసీ ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏకతాటిపైకి వచ్చిన ఏపీఎ్సఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు.. పీఆర్సీ సాధన సమితి ఉద్యమంలో
- పీఆర్సీ సాధన సమితి ఉద్యమానికి ఆర్టీసీ సంఘాల మద్దతు
- ఐక్య వేదిక ఆవిర్భావం
- సమ్మెకూ సిద్ధమని స్పష్టీకరణ
- సమ్మెకు ఆరోగ్య శాఖ సై
- వర్సిటీ ఉద్యోగులు కూడా..
- ట్రెజరీ ఉద్యోగులపై చర్యలు
- తీసుకుంటే ఆ క్షణం నుంచే సమ్మెలోకి: వెంకట్రామిరెడ్డి
విజయవాడ, జనవరి 28(ఆంధ్రజ్యోతి): పీఆర్సీపై ఉద్యోగ సంఘాల జేఏసీ ఐక్యవేదిక చేస్తున్న ఉద్యమానికి ఏపీఎ్సఆర్టీసీ ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏకతాటిపైకి వచ్చిన ఏపీఎ్సఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు.. పీఆర్సీ సాధన సమితి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని, ఏ క్షణం పిలుపునిస్తే ఆ క్షణం నుంచే సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించాయి. ఆర్టీసీ డిపోలు, వర్క్ షాప్ల వద్ద ఐక్య ఆర్టీసీ ఆందోళనలు తలపెట్టాలని నిర్ణయించాయి. శుక్రవారం విజయవాడలో ఏపీపీటీడీ ఉద్యోగ సంఘాలన్నీ సమావేశమయ్యాయి. ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు, ఈయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, పలిశెట్టి దామోదరరావు, ఎస్డబ్ల్యూఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిలాని, సీహెచ్.సుందరయ్య, కార్మిక పరిషత్ రాష్ట్ర నాయకులు వై.శ్రీనివాసరావు, ఏపీటీజీఈయూ రాష్ట్ర నాయకులు ఎ.థామస్, ఓస్వా రాష్ట్ర నాయకులు శివప్రసాద్, ఏపీఎ్సఆర్టీసీ క్లాస్-2 సూపర్ వైజర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఎ.విష్ణురెడ్డి, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డి.అంకినీడు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కేఆర్ ఆంజనేయులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్టీసీలోని వైఎ్సఆర్ అసోసియేషన్లు మినహా ప్రధాన సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇతర ఉద్యోగుల కంటే కూడా ఎక్కువగా నష్టపోయేది ఆర్టీసీ ఉద్యోగులేనని సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగ జేఏసీల ఉద్యమంలో పాల్గొని, తమ సమస్యలను పరిష్కరించుకోవాలని నాయకులు నిర్ణయించారు.
ఈ సమావేశానికి ఉద్యోగుల జేఏసీ స్ట్రగుల్ కమిటీ నేతలు వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కేఆర్ సూర్యనారాయణ, కె.శివారెడ్డి హాజరయ్యారు. ఆతర్వాత అందరూ కలిసి విలేకరులతో మాట్లాడారు. మీడియా సమావేశంలో ఆర్టీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ పీఆర్సీ జీవోలతో ఎక్కువగా నష్టపోయేది ఆర్టీసీ ఉద్యోగులేనని చెప్పారు. ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలపై జేఏసీ సంఘాలకు లేఖలు ఇచ్చామని, వారు తమ అంశాలపై ప్రభుత్వంతో మాట్లాడతారన్న ఉద్దేశంతో పీఆర్సీ స్ట్రగుల్ కమిటీ ఆందోళనకు మద్దతు పలుకుతున్నామని చెప్పారు. ఆర్టీసీ ఎండీ స్థాయిలో పరిష్కరించాల్సిన అంశాలపై సోమవారం ఉద్యోగుల ఐకాస వినతిపత్రం ఇస్తుందన్నారు.
సమ్మెలోకి ఆరోగ్య శాఖ
విజయవాడ, జనవరి 28: పీఆర్సీ కార్యాచరణ సాధన సమితి ఉద్యమానికి జై కొడుతూ.. యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్, ఆల్ యూనివ ర్సిటీస్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్.. ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించాయి. ఈమేరకు ఆయా సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం సమ్మె నోటీసులు అందజేశారు. వైద్య ఆరోగ్యశాఖలో వివిధ విభాగాలు, నేషనల్ హెల్త్ మిషన్ పథకాలలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, సర్వీస్ ప్రొవైడర్ల ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెలోకి వెళుతున్నట్లు యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, అధ్యక్షుడు వలివెల శ్రీనివాసరావు, ప్రధాన కార్యద ర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు ప్రకటించారు.
ఉద్యోగులకు సంఘీభావంగా లెఫ్ట్ సదస్సులు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, కార్మికులు, పెన్షనర్లు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యాన ఫిబ్రవరి 1,2 తేదీల్లో అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడలో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు శుక్రవారం సమవేశమయ్యారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పీఆర్సీ జీవోలను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఉద్యోగుల సమ్మెను నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
సమ్మెలోకి విశ్వవిద్యాలయాల ఉద్యోగులు
పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఫిబ్రవరి ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొంటారని ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కేఎస్ కోటేశ్వరరావు తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి సమ్మె నోటీసు కూడా ఇచ్చినట్టు చెప్పారు.