సాగు చట్టాలపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పణ

ABN , First Publish Date - 2021-03-31T20:30:36+05:30 IST

కొత్త సాగు చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఏప్రిల్ 5న దీనిని సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది. కొత్త సాగు చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన నివేదికను సీల్డ్

సాగు చట్టాలపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పణ

న్యూఢిల్లీ : కొత్త సాగు చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఏప్రిల్ 5న దీనిని సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది.


ఈ కమిటీ సభ్యుడు, వ్యవసాయ ఆర్థికవేత్త అనిల్ ఘన్వత్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త సాగు చట్టాలపై నివేదికను  రూపొందించి, మార్చి 19న సీల్డ్ కవర్లో పెట్టి అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించినట్లు తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నందువల్ల మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. 


కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నవంబరు చివరి నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో వీరంతా ఉద్యమిస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి భరోసా కల్పించే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఓ కమిటీని నియమించింది. ఈ చట్టాలను పరిశీలించి, సంబంధితులందరితో మాట్లాడి, నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ కమిటీలో ఘన్వత్, అశోక్ గులాటి, ప్రమోద్ జోషీ ఉన్నారు. 


కొత్త సాగు చట్టాలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ కమిటీ 85 రైతు సంఘాలు, సంబంధిత ఇతరులతో మాట్లాడింది. సుమారు నాలుగు నెలల నుంచి ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. 


ఈ చట్టాలను పార్లమెంటు 2020 సెప్టెంబరులో ఆమోదించింది. వీటి అమలును ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు నిలిపివేసింది. 


Updated Date - 2021-03-31T20:30:36+05:30 IST