విదేశీ తబ్లిగీల వీసాల పరిస్థితి ఏంటి?
ABN , First Publish Date - 2020-06-30T08:17:29+05:30 IST
తబ్లిగీ జమాత్ కార్యకలాపాల్లో పాల్గొని బ్లాక్లిస్టు వేటుపడిన దాదాపు 2,500 మంది విదేశీయుల వీసాల పరిస్థితిపై వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర హోం శాఖను ఆదేశించింది...
- కేంద్రాన్ని వివరణ కోరిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, జూన్ 29: తబ్లిగీ జమాత్ కార్యకలాపాల్లో పాల్గొని బ్లాక్లిస్టు వేటుపడిన దాదాపు 2,500 మంది విదేశీయుల వీసాల పరిస్థితిపై వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర హోం శాఖను ఆదేశించింది. విదేశీయుల వీసాలను రద్దు చేసే ముందు వారికి వ్యక్తిగతంగా నోటీసులిచ్చారా అని త్రిసభ్య ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఒకవేళ నోటీసులు ఇస్తే వాటికి సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సిందిగా ధర్మాసనం కేంద్ర హోం శాఖను ఆదేశించింది. తమ వీసాలను బ్లాక్లిస్టులో పెట్టడాన్ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యలో విదేశీయులు దాఖలు చేసిన పలు వ్యాజ్యాలను ధర్మాసనం సోమవారం విచారించింది.
విదేశీయుల వీసాల రద్దుపై ప్రకటన చేయాల్సిందిగా కేంద్ర హోంశాఖను ఆదేశించింది. తమకు ప్రత్యామ్నాయంగా మరో మూడు చోట్ల వసతి కల్పించాలని కోరుతూ పలువురు విదేశీ తబ్లిగీ జమాత్ సభ్యులు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులిచ్చింది.