మతం రంగు పులమడం దేశానికే ప్రమాదం.. CJI ఆందోళన

ABN , First Publish Date - 2021-09-02T19:13:12+05:30 IST

సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పెరిగిపోతుండడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు.

మతం రంగు పులమడం దేశానికే ప్రమాదం.. CJI ఆందోళన

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పెరిగిపోతుండడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కోవిడ్-19 వ్యాప్తికి తబ్లిగీ జమాత్ సమావేశాలే కారణమని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు మతం రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై సీజేఐ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కూడా న్యాయమూర్తులు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్తివంతమైన వ్యక్తులు చెబితే మాత్రమే సోషల్ మీడియా సంస్థలు పట్టించుకుంటున్నాయని సీజేఐ అభిప్రాయపడ్డారు.


ఇక వివిధ హైకోర్టుల్లో దాఖలైన సోషల్ మీడియా కేసులకు సంబంధించిన పిటిషన్లన్నింటినీ సుప్రీం కోర్టుకు బదిలీ చేసి విచారించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం స్పందించింది. అన్ని పిటిషన్‌లను కలిపి విచారించడంపై నిర్ణయం తీసుకునేందుకు కేసును ఆరు వారాల తర్వాల లిస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీజీఐ ఎన్వీ రమణ సూచించారు. ఆ తర్వాత సోషల్ మీడియా కేసులన్నీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు.



Updated Date - 2021-09-02T19:13:12+05:30 IST