బోర్డు పరీక్షలు రద్దు చేయాలంటూ సుప్రీంలో మరో పిటిషన్

ABN , First Publish Date - 2021-06-17T14:29:41+05:30 IST

దేశ వ్యాప్తంగా అన్ని బోర్డు పరీక్షలు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది.

బోర్డు పరీక్షలు రద్దు చేయాలంటూ సుప్రీంలో మరో పిటిషన్

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అన్ని బోర్డు పరీక్షలు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, కేరళ, పంజాబ్‌ రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది మమత శర్మ సుప్రీంకోర్టులో ఇంటర్ వెన్షన్ అప్లికేషన్‌ను దాఖలు చేశారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు జులై, ఆగస్టు నెలల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు న్యాయవాది పేర్కొన్నారు. నీట్‌, జెఈఈ, క్లాట్‌ వంటి పరీక్షలు భౌతికంగా హజరుకావడానికే విద్యార్ధులు భయపడుతున్నారని తెలిపారు. భౌతికంగా పరీక్షల నిర్వహణపై వేలాది విద్యార్ధుల తల్లిదండ్రులు భయంతో వణికి పోతున్నారని న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు.


ఆంధ్రప్రదేశ్‌ 10వ తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహించి తీరుతామని, ఇదే తరహాలో పంజాబ్‌, కర్నాటక, అస్సాం రాష్ట్రాలు తేదీలు కూడా ప్రకటించడాన్ని మమతా శర్మ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని రాష్ట్రాలు మినహా సీబీఎస్‌ఈ సహా అన్ని తమ పరిధిలో ఉన్న బోర్డు పరీక్షలు రద్దు చేశాయని చెప్పారు. అన్ని బోర్డులకు ఒకే నిబంధన ఉండాల్సిన అవసరం ఉందని.. తద్వారా విద్యార్థుల మనసుపై ప్రభావం లేకుండా ఉంటుందన్నారు. ఇప్పటికే విచారణ జరుగుతున్న కేసులో మమతా శర్మ  ఐఏ దాఖలు చేశారు. నేడు ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని.. విద్యార్ధుల ప్రాణాలు నిలబెట్టేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది మమతా శర్మ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-06-17T14:29:41+05:30 IST