రైతులు నిరసన తెలుపవచ్చు, కానీ... : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-10-21T18:36:48+05:30 IST

నిరసన తెలిపే హక్కు రైతులకు ఉన్నప్పటికీ

రైతులు నిరసన తెలుపవచ్చు, కానీ... : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : నిరసన తెలిపే హక్కు రైతులకు ఉన్నప్పటికీ, రోడ్లను నిరవధికంగా దిగ్బంధించరాదని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. రోడ్లపై నుంచి నిరసనకారులను ఖాళీ చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మూడు వారాల్లోగా సమాధానం సమర్పించాలని రైతు సంఘాలను ఆదేశించింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. 


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లోని రోడ్లపై పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నాయి. దాదాపు ఓ సంవత్సరం నుంచి రోడ్లను దిగ్బంధిచడంతో ప్రజలకు ఇబ్బందిగా ఉందని, వీరిని రోడ్లపై నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. నోయిడాలో నివసిస్తున్న ఓ మహిళ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. 


దీనిపై విచారణ సందర్భంగా జస్టిస్ కౌల్ మాట్లాడుతూ, చివరికి ఓ పరిష్కారాన్ని కనుగొనాలన్నారు. పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ నిరసన తెలిపేందుకు వారికి (రైతులకు) గల హక్కుపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కానీ రోడ్లను దిగ్బంధనం చేయరాదన్నారు. 


ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ డిసెంబరు 7న జరుగుతుంది. 


Updated Date - 2021-10-21T18:36:48+05:30 IST