విజయ్ మాల్యాకు జనవరి 18న శిక్ష ఖరారు : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-11-30T21:41:34+05:30 IST

బ్యాంకు రుణాలను చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన

విజయ్ మాల్యాకు జనవరి 18న శిక్ష ఖరారు : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : బ్యాంకు రుణాలను చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా తిరిగి భారత దేశం రావడం కోసం ఇక వేచి చూడలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు ధిక్కారం కేసులో ఆయనకు విధించదగిన శిక్షను వచ్చే ఏడాది జనవరి 18న నిర్ణయిస్తామని తెలిపింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఆయన తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేయడంతో ఆయన కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినట్లు నిర్థరణ అయింది. 


ఇదిలావుండగా, బ్రిటన్ నుంచి మాల్యాను భారత దేశానికి రప్పించే ప్రక్రియ చివరి దశలో ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కొన్ని రహస్య కార్యకలాపాలు బ్రిటన్‌లో పెండింగ్‌లో ఉన్నాయని, వాటి వివరాలు తెలియవని చెప్పింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ, ఏది ఏమైనప్పటికీ తాము మాల్యా కోర్టు ధిక్కారం కేసులో తదుపరి చర్యలను జనవరి 18న నిర్ణయిస్తామని తెలిపింది. న్యాయస్థానంలో స్వయంగా హాజరుకావాలా? తన న్యాయవాది ద్వారా వాదనలు వినిపించాలా? అనే అంశాన్ని నిర్ణయించుకోవలసినది మాల్యాయేనని పేర్కొంది. ఆయన కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు 2017 మే నెలలో రుజువైందని, శిక్షను విధించడం మాత్రమే పెండింగ్‌లో ఉందని పేర్కొంది. 


అంతకుముందు భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వినిపించిన వాదనలలో, మాల్యాను భారత దేశానికి అప్పగించాలని బ్రిటన్‌లోని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని, అయితే ఈ తీర్పును అమలు చేయడం లేదని తెలిపింది. 


తాను కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు 2017 మే నెలలో ఇచ్చిన ఆదేశాలపై పునఃసమీక్షించాలని మాల్యా సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ గత ఏడాది అక్టోబరు 5న మాల్యా న్యాయస్థానంలో హాజరుకాలేదు. 


మాల్యా సుమారు రూ.9,000 కోట్ల మేరకు బ్యాంకు రుణాలను తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నారు. 


భారతీయ స్టేట్ బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం విజ్ఞప్తి మేరకు మాల్యా కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు 2017 మే నెలలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బ్రిటిష్ సంస్థ డియాజియో నుంచి స్వీకరించిన 40 మిలియన్ డాలర్లను ఆయన తన పిల్లలకు బదిలీ చేశారని, ఇది వివిధ కోర్టు తీర్పులను ఉల్లంఘించడమేనని ఈ కన్సార్షియం ఆరోపించింది. 


Updated Date - 2021-11-30T21:41:34+05:30 IST