ప్రసూతి సెలవులపై కేంద్రానికి సుప్రీం నోటీసు

ABN , First Publish Date - 2021-10-01T21:46:07+05:30 IST

మూడు నెలల కన్నా తక్కువ వయసుగల బిడ్డను దత్తత

ప్రసూతి సెలవులపై కేంద్రానికి సుప్రీం నోటీసు

న్యూఢిల్లీ : మూడు నెలల కన్నా తక్కువ వయసుగల బిడ్డను దత్తత తీసుకునే తల్లి మాత్రమే ప్రసూతి సెలవు పొందడానికి అర్హురాలని చెప్తున్న నిబంధనను సవాల్ చేస్తూ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సుప్రీంకోర్టు దీనిని విచారణకు స్వీకరించి, శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. 


ప్రసూతి ప్రయోజనాల చట్టంలోని ఓ నిబంధన ప్రకారం మూడు నెలల కన్నా తక్కువ వయసుగల బిడ్డను దత్తత తీసుకునే తల్లి మాత్రమే ప్రసూతి సెలవుకు అర్హురాలవుతారు. ఈ నిబంధన పిల్లలను దత్తత తీసుకునే తల్లుల పట్ల వివక్ష చూపుతోందని, ఇది నిరంకుశ నిబంధన అని ఆరోపిస్తూ ఓ పిల్ దాఖలైంది. దీనిని జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం విచారణకు చేపట్టింది. 


ఈ పిటిషన్‌ను నండూరి హంసానందిని దాఖలు చేశారు. ప్రసూతి ప్రయోజనాల చట్టం, 1961లోని సెక్షన్ 5(4)ను సవాల్ చేశారు. 12 వారాల ప్రసూతి సెలవును పొందడానికి బిడ్డను దత్తత తీసుకునే తల్లి లేదా తండ్రికి అర్హత లభించాలంటే, మూడు నెలల కన్నా తక్కువ వయసుగల బిడ్డను దత్తత తీసుకోవాలని ఈ నిబంధన చెప్తోంది. మూడు నెలల కన్నా ఎక్కువ వయసుగల అనాథ బిడ్డను దత్తత తీసుకునే తల్లికి ప్రసూతి సెలవు మంజూరుకు ఎటువంటి నిబంధన ఈ చట్టంలో లేదని పిటిషనర్ తెలిపారు. ఈ వ్యత్యాసం వల్ల బిడ్డను దత్తత తీసుకోవాలనుకునేవారు కేవలం నవజాత శిశువులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారన్నారు. ఈ సెక్షన్ జీవ సంబంధ, దత్తత తల్లుల మధ్య మాత్రమే కాకుండా పిల్లల మధ్య కూడా వివక్ష చూపుతోందని ఆరోపించారు. దత్తత తీసుకున్న తల్లికి 12 వారాలు, జీవసంబంధ తల్లికి 26 వారాలు ప్రసూతి సెలవులను ఇస్తున్నారని, ఇది కూడా వివక్షేనని ఆరోపించారు. 


Updated Date - 2021-10-01T21:46:07+05:30 IST