ఫోన్‌ సంభాషణను ఆయనే ఒప్పుకొన్నారు..

ABN , First Publish Date - 2021-04-13T08:56:50+05:30 IST

జడ్జి రామకృష్ణతో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్య జరిపిన ఫోన్‌ సంభాషణ నిజమైనదో కాదో దర్యాప్తు చేయనవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఫోన్‌ సంభాషణను ఆయనే ఒప్పుకొన్నారు..

ఇక ఆడియో టెస్టు అక్కర్లేదు

ఒరిజినల్‌ పిల్‌పై హైకోర్టుకే అధికారం

జస్టిస్‌ ఈశ్వరయ్య కేసులో సుప్రీం తీర్పు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): జడ్జి రామకృష్ణతో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్య జరిపిన ఫోన్‌ సంభాషణ నిజమైనదో కాదో దర్యాప్తు చేయనవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఫోన్‌లో మాట్లాడింది వాస్తవమేనని జస్టిస్‌ ఈశ్వరయ్య తన అఫిడవిట్‌లో అంగీకరించినందున.. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌తో విచారణ అక్కర్లేదని పేర్కొంది. హైకోర్టు ఆదేశాలను పక్కనపెడుతూ జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభా్‌షరెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. హైకోర్టు ప్రాంగణంలో కరోనా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా ఆదేశాలివ్వాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ హైకోర్టులో నిరుడు ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయడం.. ఫెడరేషన్‌ అర్హతను సవాల్‌ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ కౌంటర్‌ వేయడం.. ఇవే ఆరోపణలతో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఈశ్వరయ్య రాష్ట్రపతికి లేఖ రాశారని.. బీసీ సంఘం ముసుగులో ఆయన హైకోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టు దృష్టికి తేవడం తెలిసిందే. దీనిపై విచారణ పూర్తయ్యాక.. సదరు విద్యార్థి సంఘం వెనుక జస్టిస్‌ ఈశ్వరయ్య ఉన్నారంటూ సస్పెండైన జడ్జి కె.రామకృష్ణ హైకోర్టులో మధ్యంతర దరఖాస్తు దాఖలు చేయడం..


ఇందుకు ఆధారంగా ఆయన తనతో ఫోన్లో జరిపిన సంభాషణను పెన్‌డ్రైవ్‌లో కోర్టుకు అందించడం.. పెన్‌డ్రైవ్‌లోని సంభాషణ నిజమో కాదో తేల్చేందుకు జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌తో దర్యాప్తు చేయించాలని హైకోర్టు ఆదేశించడమూ విదితమే. దీనిని సవాల్‌ చేస్తూ జస్టిస్‌ ఈశ్వరయ్య సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదనలు విన్న ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది. ‘సంభాషణలో వాస్తవమెంతో.. ఈ కుట్ర వెనుక మూడో వ్యక్తి పాత్ర ఉన్నదేమో తేల్చాలని.. జస్టిస్‌ రవీంద్రన్‌ విచారణ అంతవరకే పరిమితం కావాలని.. ప్రధాన రిట్‌ పిటిషన్‌పై దీని ప్రభావం ఉండదని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ జస్టిస్‌ ఈశ్వరయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిరుడు జూలై 20న రామకృష్ణతో జస్టిస్‌ ఈశ్వరయ్య మాట్లాడారని వాదనల సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అంగీకరించారు. దీనిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని మేం ఈ ఏడాది జనవరి 11న ఆదేశించాం. ఆ మేరకు జస్టిస్‌ ఈశ్వరయ్య అఫిడవిట్‌ వేశారు. రామకృష్ణ గత ఏడాది జూలై 20న తనతో వాట్సా్‌పలో మాట్లాడారని ఆయన అంగీకరించారు.


సంభాషణ జరిగిందని తామే ఒప్పుకొంటున్నందున ఇక విచారణ అక్కర్లేదని ప్రశాంత్‌ భూషణ్‌ తెలిపారు. అందుచేత విచారణ అక్కర్లేదని మేమూ భావిస్తున్నాం. ప్రస్తుతం పిల్‌ విచారణార్హత అంశమే హైకోర్టు ముందు ఉంది. దీనిపై మేం ఎలాంటి నోటీసులూ ఇవ్వడం లేదు. విచారణ అనంతరం హైకోర్టే ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలి’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫోన్‌ సంభాషణ అనువాదం విషయంలో హైకోర్టు ముందుకు వెళ్లాలనుకుంటే తన వాదన వినిపించుకోవడానికి జస్టిస్‌ ఈశ్వరయ్యకు అవకాశమిచ్చాకే చేయాలని సూచించింది. ఆయన పిటిషన్‌ను పరిష్కరించింది.

Updated Date - 2021-04-13T08:56:50+05:30 IST