పెగాస్సపై నేడు సుప్రీం తీర్పు
ABN , First Publish Date - 2021-10-27T07:50:53+05:30 IST
అన్ని పక్షాల వాదనలూ పూర్తి సవివర అఫిడవిట్కు కేంద్రం విముఖత దానివల్ల దేశ భద్రతకు ముప్పు....
అన్ని పక్షాల వాదనలూ పూర్తి
సవివర అఫిడవిట్కు కేంద్రం విముఖత
దానివల్ల దేశ భద్రతకు ముప్పు: ఎస్జీ
న్యూఢిల్లీ, అక్టోబరు 26: పెగాసస్ నిఘా వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు ఇవ్వనున్నది. సీజే జస్టిస్ ఎన్వీ రమ ణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అన్ని పక్షాల వాదనలను విన్న తర్వాత సెప్టెంబరు 13న తన తీర్పును వాయిదా వేసింది. పౌరులపై నిఘా కోసం పెగాసస్ స్పైవేర్ను కేంద్రం చట్టవిరుద్ధ పద్ధతుల్లో వినియోగించిందా లేదా అన్న విషయం మాత్రమే తాము తెలుసుకోగోరుతున్నామని ధర్మాసనం అప్పట్లో పేర్కొంది. కొంతమంది ముఖ్యుల ఫోన్లను హ్యాకింగ్ చేసినట్లుగా వచ్చిన వార్తలపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలివ్వాంటూ పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీనిపై ద ర్యాప్తునకు సాంకేతికపరమైన నిపుణుల కమిటీని నియమించి, ఆ త ర్వాత మధ్యంతర ఉత్తర్వులిస్తామని ధర్మాసనం తెలిపింది. ఫలానా సాఫ్ట్వేర్ను ప్రభుత్వం ఉపయోగించిందా లేదా అన్న దానిపై సవివర అఫిడవిట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని ఎస్జీ తుషార్ మెహతా గతంలోనే కోర్టుకు చెప్పారు. నిఘాకు ఫలానా సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నామా లేదా అన్న విషయాన్ని వెల్లడిస్తే దేశ భద్రతకు హాని కలుగుతుందని, ఉగ్ర గ్రూపులతోపాటు ప్రమాదకర శక్తులన్నీ అప్రమత్తమయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
మోదీకి క్లీన్ చిట్ను పరిశీలిస్తాం
ఇరవై ఏళ్లనాటి గుజరాత్ అల్లర్లకు సంబంధించి జకియ అహ్సన్ జాఫ్రీ వ్యాజ్యంపై సుప్రీం మంగళవారం తుది విచారణ చేపట్టింది. న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను విచారిస్తోంది. 2002లో జరిగిన గుజరాత్ మతకలహాలలో నాటి గుజరాత్ సీఎం, ప్రస్తుత ప్రధాని మోదీకి ‘సిట్’ క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై జకియ సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ అల్లర్ల కేసులో మోదీసహా 64 మందికి క్లీన్ చిట్ ఇస్తూ సిట్ సమర్పించిన క్లోజర్ రిపోర్టును పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది.