మార్గదర్శి కేసులో రామోజీకి సుప్రీం నోటీసులు
ABN , First Publish Date - 2020-08-11T09:18:18+05:30 IST
నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థతోపాటు ఆ సంస్థ అధినేత రామోజీరావుకు
న్యూఢిల్లీ, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థతోపాటు ఆ సంస్థ అధినేత రామోజీరావుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే, కేసులో ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణంరాజుకు కూడా నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థపై ఆరోపణలకు సంబంధించి ట్రయల్ కోర్టులో దాఖలైన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు గతంలో కొట్టివేసింది. దాంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీలు వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యాజ్యంలో రిజర్వు బ్యాంకును ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్ అభ్యర్థనను అంగీకరించింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్.సత్యనారాయణ ప్రసాద్ వాదిస్తూ రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి సంస్థ దాదాపు రూ.2,600 కోట్ల మేరకు డిపాజిట్లు సేకరించిందన్నారు. దీనికి సంబంధించి ట్రయల్ కోర్టులో ఉన్న క్రిమినల్ కంప్లైంట్ను కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి సంస్థ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిందని, దానిని 2018 డిసెంబరు 31న హైకోర్టు కొట్టివేసిందన్నారు. అయితే, రిజర్వు బ్యాంకు చట్టంలోని సెక్షన్ 45(ఎస్)ను హైకోర్టు సరిగ్గా అన్వయించలేదని చెప్పారు. హిందూ అవిభక్త కుటుంబం కింద ఉన్న సంస్థలకు డిపాజిట్లు సేకరించే అధికారం లేదని వివరించారు.