ఏపీకి 7 రోజుల్లో డబ్బులు ఇచ్చేయండి.. తెలంగాణకు సుప్రీం ఆదేశం
ABN , First Publish Date - 2021-09-15T09:31:05+05:30 IST
తెలుగు అకాడమీ విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సిన డబ్బును వారం రోజుల్లో బదిలీ చేయాలని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం
- తెలుగు అకాడమీ కేసులో తెలంగాణకు సుప్రీం ఆదేశం
- చరాస్తుల పంపిణీ తర్వాతే స్థిరాస్తులపై నిర్ణయం
- ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని సూచన
న్యూఢిల్లీ, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): తెలుగు అకాడమీ విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సిన డబ్బును వారం రోజుల్లో బదిలీ చేయాలని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణకు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు బదిలీ చేయలేదంటూ కోర్టు దృష్టికి ఏపీ తీసుకువచ్చింది. తాము రెండు వారాల్లో డబ్బులు బదిలీ చేస్తామని, మరికొన్ని డాక్యుమెంట్లు అందజేస్తామని తెలంగాణ తరఫు న్యాయవాది సమయం కోరారు. అయితే, అందుకు కోర్టు వారం రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. విభజన చట్టంలో ఉన్న స్థిరాస్తుల్లోనూ తమకు వాటా వస్తుందని ఏపీ వాదించగా.. ముందుగా చరాస్తులు, బ్యాంకు నిధుల పంపిణీ అంశాలను పరిష్కరించుకోవాలని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
తెలంగాణ అకాడమీ, ఉద్యోగులు, ఆస్తుల పంపకాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. కాగా, అకాడమీ స్థిరాస్తులకు సంబంధించి తదుపరి విచారణను మూడు వారాల పాటు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తెలుగు అకాడమీ విభజనకు సంబంధించి విశ్రాంత న్యాయమూర్తితో కమిటీ వేయాలని ఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తికి తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యంతరాలు తెలిపారు. స్థిరాస్తులు పంచాలన్న ఏపీ విధానంపై కేసు వేసిన తెలంగాణ ప్రభుత్వం ఆస్తుల పంపకంపై ఇప్పటి వరకూ పాటించిన విధానాన్ని వివరించింది.