సూరత్ మున్సిపాలిటీలో దారుణం...

ABN , First Publish Date - 2020-02-21T17:37:01+05:30 IST

భుజ్ కళాశాల వసతిగృహంలోని 68 మంది బాలికలను బాత్రూమ్‌కు తీసుకెళ్లి వారి దుస్తులు తొలగించి పరీక్షించిన దారుణ ఘటన మరవక ముందే సూరత్ నగరంలో మరో అమానుష ఘటన జరిగింది....

సూరత్ మున్సిపాలిటీలో దారుణం...

మహిళా ఉద్యోగినులను నగ్నంగా నిలబెట్టి ఫింగర్ టెస్ట్  

సూరత్ (గుజరాత్) : భుజ్ కళాశాల వసతిగృహంలోని 68 మంది బాలికలను బాత్రూమ్‌కు తీసుకెళ్లి వారి దుస్తులు తొలగించి పరీక్షించిన దారుణ ఘటన మరవక ముందే సూరత్ నగరంలో మరో అమానుష ఘటన జరిగింది. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న వందమంది మహిళా ఉద్యోగినులను ప్రభుత్వ ఆసుపత్రిలో నగ్నంగా నిలబెట్టి లేడీ డాక్టర్లు గైనకాలజికల్ (స్త్రీ జననేంద్రియ) పరీక్షలు చేశారు. మూడేళ్లుగా ట్రెయినీ క్లర్కులుగా పనిచేస్తున్న వందమంది మహిళా ఉద్యోగినులను పర్మినెంట్ చేసేందుకు గాను వారికి ఫిట్‌నెస్ పేరిట జననేంద్రియాల్లో ఫింగర్ టెస్ట్ పరీక్షలు చేశారని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. సూరత్ మున్సిపల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రిలోని ఒక్కో గదిలో గ్రూపుల వారీగా పదిమంది చొప్పున మహిళా ఉద్యోగినులను నగ్నంగా నిలబెట్టి తలుపు కూడా సరిగా వేయకుండా కర్టెయిన్‌తో మూసి బలవంతంగా పరీక్షలు చేశారని ఉద్యోగుల సంఘం నేతలు ఆరోపించారు. పెళ్లి కాని మహిళా ఉద్యోగినులపై సైతం లేడీ డాక్టర్లు అత్యంత దురుసుగా ప్రవర్తిస్తూ వారికికూడా గర్భధారణ పరీక్షలు చేశారని ఉద్యోగులు ఆరోపించారు.


మూడేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసేందుకు కంటి, చెవి,ముక్కు, గొంతు, గుండె, ఊపిరితిత్తుల పరీక్షలతోపాటు ఫింగర్ టెస్ట్ చేయడం సంచలనం రేపింది. మహిళా ఉద్యోగినుల పట్ల అమానుషంగా వ్యవహరించి ఫింగర్ టెస్ట్ లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఉద్యోగుల సంఘం ప్రధానకార్యదర్శి ఏఏ షేక్ డిమాండ్ చేశారు. అవివాహిత మహిళా ఉద్యోగినును సైతం గర్భం దాల్చారా అంటూ ప్రశ్నించి అవమాన పర్చారని షేక్ ఆరోపించారు. కాగా మహిళా ఉద్యోగినుల ఫిట్ నెస్ గురించి పరీక్షలు చేయడం నిబంధనల ప్రకారం తప్పనిసరి అని గైనకాలజీ విభాగం డాక్టర్ అశ్వనీ చెబుతున్నారు. మొత్తంమీద సూరత్ మున్సిపాలిటీలో మహిళా ఉద్యోగినులకు జరిపిన పరీక్షల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. 

Updated Date - 2020-02-21T17:37:01+05:30 IST