సురోజీబాబా బోధనలు ఆదర్శప్రాయం
ABN , First Publish Date - 2022-01-24T04:29:19+05:30 IST
సమాజాన్ని భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్లిన సంత్ సురోజీబాబా బోధనలు అందరికీ ఆదర్శప్రాయం కావాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ అన్నారు.
- ఎంపీ సోయం బాపూరావ్
సిర్పూర్(యూ), జనవరి 23: సమాజాన్ని భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్లిన సంత్ సురోజీబాబా బోధనలు అందరికీ ఆదర్శప్రాయం కావాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ అన్నారు. మండలంలోని గురుదేవ ఆశ్రమం మహగాంలో కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహలో ఆయన పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసులు భక్తిమార్గంలో పయనిస్తున్నందున కుటుంబ సభ్యులందరూ ఆనందంలో ఉంటున్నారని అన్నారు. ఆదేవిధంగా జంగుబాయి ఆదివాసులకు ఆరాధ్య దైవమని ఆదివాసులు తప్పక జంగో, లింగో దీక్షలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆఖండ హరినామ సప్తహ కార్యక్రమంపై ఆయన కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆశ్రమం పీఠాధిపతి మేస్రం కైలాస్ మహరాజ్, మహగాం సర్పంచ్ ఆత్రం పద్మబాయి రాజేశ్వర్, ధన్నోర సర్పంచ్ ఆత్రం పొల్లాజీ, కమిటీ సభ్యులు ఆత్రం భీంరావ్, బీజేపీ మండల అధ్యక్షుడు గేడాం సంబు, గోండి ధర్మకోయ పుణ్యం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆత్రం ఆనంద్రావ్, తానుపటేల్, వైస్ఎంపీపీ ఆత్రం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
మేక్ ఇన్ ఇండియా పథకంతో సమగ్రాభివృధ్ధి
జైనూరు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మేక్ ఇన్ ఇండియా పథకంతో డబోలి గ్రామాన్ని అభివృధ్ధి చేసి ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపూరావ్ అన్నారు. మండలంలోని డబోలి గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ మేక్ఇన్ ఇండియా పథకాన్ని ఆది వాసుల ఉన్నతికోసం ఆదిలాబాద్ జిల్లాకు తీసుకొచ్చా మన్నారు. ఈ పథకంపై ఆదివాసులు ఆవగాహన కల్పించు కోవాలని కోరారు.
వ్యవసాయ అభివృద్ధి, రోడ్లు, మురికికాలువలు, నిరుద్యోగు లకు శిక్షణ, మినరల్ వాటర్ సదుపాయం, సోలార్ లైట్ తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మేస్రం నాగోరావ్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదరి కోట్నాక విజయ్కుమార్, కుంర దుందేరావ్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మేస్రం మోతీరాం, ఆ పార్టీ మండల అధ్యక్షుడు మేస్రం దౌలత్రావ్, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.