మిగులు ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు ఇవ్వండి: డిప్యూటీ సీఎం
ABN , First Publish Date - 2021-05-13T19:55:59+05:30 IST
కరోనా కేసుల విషయంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారంనాడు ..
న్యూఢిల్లీ: కరోనా కేసుల విషయంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారంనాడు ఒకింత చల్లటి కబురు చెప్పారు. రోజువారీ కొత్త కేసుల సఖ్య గత 24 గంటల్లో 10,400కు తగ్గిందని, పాజిటివిటీ రేటు 14 శాతానికి చేరిందని తెలియజేశారు. తమకు ఇస్తున్న ఆక్సిజన్లో మిగులు ఆక్సిజన్ను వేరే రాష్ట్రాలకు కేటాయించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాసినట్టు ఆయన చెప్పారు. ''కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిన సమయంలో ఢిల్లీ ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన కేంద్రం, ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు. కేసులు బాగా పెరిగినప్పుడు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమైంది. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఆక్సిజన్ అవసరం కూడా 582 మెట్రిక్ టన్నులకు తగ్గింది. మిగులు ఆక్సిజన్ను వేరే రాష్ట్రాలకు ఇవ్వాలని కేంద్రానికి చెప్పాం. మాది బాధ్యత గల ప్రభుత్వం'' అని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.