సూర్యాపేట ర్యాగింగ్‌ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

ABN , First Publish Date - 2022-01-04T17:32:47+05:30 IST

సూర్యాపేట ర్యాగింగ్ ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

సూర్యాపేట ర్యాగింగ్‌ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

హైదరాబాద్:  సూర్యాపేట ర్యాగింగ్ ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసి ఇబ్బందులకు గురిచేసిన ఆరుగురు సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేస్తూ డీఎంఈ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 2019-20 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు జె.మహేందర్, జి.శశాంక్, పి.శ్రవణ్, ఏ.రంజిత్ సాయి, కె.హరీష్, బి.సుజిత్‌పై ఏడాది పాటు సస్పెన్షన్‌ వేటు పడింది. అలాగే వారిని హాస్టల్‌ నుంచి శాశ్వతంగా రద్దు చేస్తూ డీఎంఈ రమేష్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. 


సూర్యాపేట మెడికల్ కళాశాలలో ఓ జూనియర్ విద్యార్థిని సీనియర్ విద్యార్థులు నాలుగు గంటల పాటు వేధించారు. హైదరాబాద్‌లోని మైలార్‌దేవులపల్లి ప్రాంతానికి చెందిన సాయికుమార్...సూర్యాపేట మెడికల్ కాలేజ్‌లో చదువుతూ కళాశాలకు చెందిన హాస్టల్‌లో ఉంటున్నాడు.  ఈ క్రమంలో ఈనెల 1న కొందరు సీనియర్ విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటూ మద్యం సేవించారు. సాయికుమార్‌ను తమ గదికి రావాలని పిలిచారు. సీనియర్ల గదికి వెళ్లిన విద్యార్థి సాయికుమార్ పట్ల సీనియర్లు అనుచితంగా ప్రవర్తించారు. బయోడేటా చెప్పాలని, దుస్తులు విప్పించి ఇబ్బందులకు గురిచేస్తూ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. సీనియర్ల నుంచి తప్పించుకున్న విద్యార్థి తన తండ్రికి ఫోన్ చేసి విషయం తెలియజేశారు. వెంటనే అతడు 100కు ఫోన్ చేయడంతో పట్టణ పోలీసులు హాస్టల్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కాగా, ర్యాగింగ్‌ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది.  ప్రాథమిక విచారణ అనంతరం ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్‌ విద్యార్థులపై కేసులు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. ర్యాగింగ్‌ ఘటనపై మంత్రి హరీశ్‌ రావు స్పందించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఎంఈ రమేశ్‌రెడ్డిని ఆదేశించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-01-04T17:32:47+05:30 IST