జెన్కో ఇంజనీర్ అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2020-05-28T10:20:22+05:30 IST
విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం సీలేరులో హోం క్వారంటైన్లో ఉన్న ఏపీ జెన్కో అసిస్టెంట్ ఇంజనీర్ కె.శ్రీనివాసరావు
- హోం క్వారంటైన్లో ఉండగా ఘటన
- స్వస్థలం అమలాపురం
సీలేరు, మే 27: విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం సీలేరులో హోం క్వారంటైన్లో ఉన్న ఏపీ జెన్కో అసిస్టెంట్ ఇంజనీర్ కె.శ్రీనివాసరావు(41) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన శ్రీనివాసరావు 2017 డిసెంబరు నుంచి సీలేరులో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కుటుంబం రాజమహేంద్రవరంలో నివాసం ఉంటోంది. మార్చి 21న కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లిన ఆయన లాక్డౌన్ కారణంగా ఈ నెల 20వరకు అక్కడే ఉండిపోయారు. 21న సీలేరు చేరుకున్న ఆయన్ను హోం క్వారంటైన్లో ఉండాలని స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి ఆదేశించారు. అప్పటినుంచి ఇంట్లోనే ఉంటున్న శ్రీనివాసరావు మూడు రోజులుగా ఫోన్ చేయకపోవడంతో తన భర్త ఎలా ఉన్నారో చూడాలంటూ ఆయన భార్య బుధవారం సహోద్యోగులకు ఫోన్ చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంట్లోకి వెళ్లిన పోలీసులకు బెడ్రూమ్లో మంచంపై శ్రీనివాసరావు విగతజీవిగా కనిపించారు. శ్రీనివాసరావు జల విద్యుత్ కేంద్రం ఎంసీఆర్లో షిఫ్ట్ ఏఈగా విధులు నిర్వహించేవారని, ఆయన భార్య రాజమహేంద్రవరంలో ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. హోం క్వారంటైన్లో ఉన్న శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన వైద్యఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం చేశారని జెన్కో ఇంజనీర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై వైద్యాధికారిని వివరణ కోరగా సోమవారం శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి తలుపులు కొట్టినా తలుపులు తియ్యకపోవడంతో వెనక్కి వచ్చేశామని, ఆ తరువాత అక్కడికి వెళ్లలేదని తెలిపారు. అయితే మద్యం అధికంగా తీసుకోవడం వల్ల శ్రీనివాసరావు నిద్రలోనే మృతి చెంది ఉంటారని భావిస్తున్నట్టు ఎస్ఐ నీలకంఠం పేర్కొన్నారు.