నిలిచిపోయిన రాజన్న దర్శనం

ABN , First Publish Date - 2021-04-19T05:58:35+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి దర్శనాలు నిలిచిపోయాయి.

నిలిచిపోయిన రాజన్న దర్శనం
నిర్మానుష్యంగా మారిన ఆలయ ప్రాంగణం

- ప్రధాన ద్వారం మూసివేత

- ఐదు రోజులపాటు కొనసాగనున్న ఆంక్షలు

వేములవాడ, ఏప్రిల్‌ 18: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో  స్వామివారి దర్శనాలు నిలిచిపోయాయి. గత సంవత్సరం కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో మార్చి నుంచి జూన్‌ వరకు 87 రోజులపాటు స్వామివారి దర్శనం నిలిచిపోగా, తాజాగా కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతమవుతుండడంతో ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు దర్శనం నిలిపివేశారు. భక్తులు ఆలయం లోపలికి ప్రవేశించడానికి వీలు లేకుండా ఆలయ రాజగోపురం వద్ద ప్రధాన ద్వారంతోపాటు అన్ని మార్గాలను  బారికేడ్లతో మూసివేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయం వెలుపల ప్రధాన ద్వారం బయట రోడ్డు మీద నుంచి స్వామివారికి మొక్కులు  చెల్లించుకొని వెళ్తున్నారు. కొవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా ఆదివారం నుంచి ఈ నెల 22వ తేదీ గురువారం వరకు సర్వదర్శనంతోపాటు కోడెమొక్కు,  స్వామివారి కల్యాణం వంటి అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 21వ తేదీ బుధవారం నిర్వహించాల్సిన సీతారామచంద్రస్వామివారి కల్యాణాన్ని ఆలయం లోపల కొద్ది మంది అర్చకుల సమక్షంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆలయం లోపలికి ప్రవేశం లేనందున  సీతారాముల కల్యాణం కోసం భక్తులు వేములవాడకు రావద్దని కోరారు.

Updated Date - 2021-04-19T05:58:35+05:30 IST