కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన స్వాత్మానందేంద్ర స్వామీజీ

ABN , First Publish Date - 2021-07-12T17:03:43+05:30 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి కలిశారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన స్వాత్మానందేంద్ర స్వామీజీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి కలిశారు. సోమవారం ఉదయం కిషన్ రెడ్డి నివాసానికి వెళ్ళిన స్వామీజీ ప్రాచీన ఆలయాలకు అడ్డంకిగా మారిన పురావస్తుశాఖ షరతులు, నిబంధనలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక ఆలయాలు  పురావస్తుశాఖ నిబంధనలు అడ్డంకిగా మారాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రాచీన నిర్మాణాలపై పురావస్తుశాఖ పర్యవేక్షణ ఎంత ముఖ్యమో, వాటి సంరక్షణకు అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని చెప్పారు. తెలంగాణలో వేయి స్తంభాల గుడి, ఆంధ్రలో పంచారామ క్షేత్రాలు పురావస్తు శాఖ నియమనిబంధనల కారణంగా అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయ, జానపద కళల పరిరక్షణకు విశేషంగా కృషి చేయాలన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఈనెల 24 నుంచి చేపట్టనున్న చాతుర్మాస్య దీక్ష గురించి కేంద్రమంత్రికి వివరించారు. రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు కిషన్ రెడ్డి దంపతులకు ఉండాలని ఆకాంక్షించారు. ఆదిశంకరాచార్య ప్రతిమను బహుకరించి పీఠం దుశ్శాలువతో కిషన్ రెడ్డి దంపతులను స్వామీజీ సత్కరించారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. 



Updated Date - 2021-07-12T17:03:43+05:30 IST