ఆ రెండే కీలకం.. స్వర్ణాప్యాలెస్లో సీన్ రీ కనస్ట్రక్షన్
ABN , First Publish Date - 2020-08-13T12:43:15+05:30 IST
స్వర్ణాప్యాలెస్లో అగ్ని ప్రమాదం రెండు ప్రదేశాల నుంచి సంభవించిందని..
ఫ్రంట్ ఆఫీస్, సర్వర్ రూమ్ల పరిశీలన
మూడు గంటల పాటు సాగిన నమూనాల సేకరణ
విజయవాడ(ఆంధ్రజ్యోతి): స్వర్ణాప్యాలెస్లో అగ్ని ప్రమాదం రెండు ప్రదేశాల నుంచి సంభవించిందని దర్యాప్తు బృందాలు నిర్ధారించాయి. హోటల్లోని ఫ్రంట్ ఆఫీస్ (రిసెప్షన్), దానికి వెనుకవైపు ఉన్న సర్వర్ రూమ్ నుంచి మంటలు వ్యాపించాయని అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబ్ ఉపసంచాలకుడు సురేష్, సీఈఐజీ (చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ గవర్నమెంట్) అధికారులు విజయలక్ష్మి తదితరులు హోటల్లో బుధవారం సీన్ రీ కనస్ట్రక్షన్ చేశారు. ఇప్పటికే నాలుగు అంతస్తులను పరిశీలించి కొన్ని నమూనాలు సేకరించిన అధికారులు పూర్తిస్థాయి విశ్లేషణ కోసం బుధవారం అన్ని అంతస్తులను పరిశీలించి సీన్ రీ కనస్ట్రక్షన్ చేశారు. ఫ్రంట్ ఆఫీస్, సర్వర్ రూమ్ను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యుత్ తీగలు, ఇతరత్రా పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మంటలకు మసైపోయిన హోటల్ కింది అంతస్తు మొత్తాన్ని వీడియో ద్వారా చిత్రీకరించారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూటేనా..?
ఫ్రంట్ ఆఫీసులో ఉన్న కంప్యూటర్ నుంచి షార్ట్ సర్క్యూట్ అయిందని కొందరు చెబుతున్నారు. ల్యాప్టాప్ నుంచి మంటలు రేగాయని మరికొంతమంది అంటున్నారు. తొలుత పొగ సర్వర్ రూమ్ నుంచి పైకి లేచిందని పోలీసులు చెబుతున్నారు. అసలు ప్రమాదానికి మూలాలు ఎక్కడున్నాయన్న దానిపై సాంకేతికంగా విశ్లేషణ సాగుతోంది. ఎఫ్ఎస్ఎల్, సీఈఐజీ అధికారులు మొత్తం మూడు గంటలు పునఃపరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీకి సంబంధించి డీవీఆర్, కంప్యూటర్ హార్డ్డిస్క్ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎఫ్ఎస్ఎల్లో సాంకేతిక విధానంలో విశ్లేషించాక నివేదికను సిద్ధం చేస్తారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటేనని ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ, ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. వాస్తవాలు తెలియ డానికి డీవీఆర్, హార్డ్డిస్క్ విశ్లేషణ తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్త వడానికి నాలుగైదు రోజులు పడుతుంది. మరోపక్క రమేష్ ఆస్పత్రి ఎండీ రమేష్బాబు కోసం ఎనిమిది బృందాలు గాలిస్తున్నాయి.