రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ అదుపులోనే ఉంది!

ABN , First Publish Date - 2020-02-22T07:39:01+05:30 IST

రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ అదుపులోనే ఉందని, ఈ విషయంలో వైద్య ఆరోగ్యశాఖ పూర్తి అప్రమత్తతతో ఉందని ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు తెలిపారు. ‘సైన్‌ఫ్లూ స్వైర విహారం’ శీర్షికతో శుక్రవారం...

రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ అదుపులోనే ఉంది!

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ప్రజారోగ్య సంచాలకుడి వివరణ


హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ అదుపులోనే ఉందని, ఈ విషయంలో వైద్య ఆరోగ్యశాఖ పూర్తి అప్రమత్తతతో ఉందని ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు తెలిపారు. ‘సైన్‌ఫ్లూ స్వైర విహారం’ శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. గత ఏడాదితో పొల్చితే స్వైన్‌ ఫ్లూ తీవ్రత పెద్దగా లేదన్నారు. 2019 జనవరిలో 296, ఫిబ్రవరిలో 417 మొత్తం రెండు నెలల వ్యవధిలోనే 713 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదు అయితే.. ఈ ఏడాది ఇప్పటివరకు 148 కేసులే నమోదయ్యాయని వివరించారు. జనవరిలో ఇద్దరు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. స్వైన్‌ ఫ్లూ సోకడంతో చనిపోయారని వెల్లడించారు. ప్రస్తుతం కరోనాకు సంబంధించిన స్ర్కీనింగ్‌ను పెద్ద ఎత్తున చేస్తుండటంతో వాటిలో ఒకటీ అరా స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయన్నారు. ఇప్పటికే గాంధీ, చెస్ట్‌, ఫీవర్‌ ఆస్పత్రుల్లో స్వైన్‌ ఫ్లూ ఐసీయూలను.. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక స్వైన్‌ ఫ్లూ ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశామన్నారు. స్వైన్‌ ఫ్లూ నిర్ధరణ పరీక్ష ఫలితాలను కేవలం 12 గంటల్లో వెల్లడిస్తున్నామని, అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఎవరికైనా స్వైన్‌ ఫ్లూ లక్షణాలుంటే 040-24651119 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు. 

Updated Date - 2020-02-22T07:39:01+05:30 IST