భూకబ్జాదారులపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2020-08-14T10:29:22+05:30 IST

కరీంనగర్‌, చుట్టుపక్క ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను కొంతమంది నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారని, దీనిపై హైకోర్టు

భూకబ్జాదారులపై చర్యలు తీసుకోండి

సీఎంకు పొన్నం ప్రభాకర్‌ లేఖ


కరీంనగర్‌ క్రైం, ఆగస్టు 13 : కరీంనగర్‌, చుట్టుపక్క ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను కొంతమంది నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారని, దీనిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి లేదా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో  విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కోరుతూ మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ గురువారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంతో పాటు బొమ్మకల్‌, సీతారాంపూర్‌, కొత్తపల్లి, రేకుర్తి, చింతకుంట, తీగలగుట్టపల్లి, ఆరెపల్లి, వల్లంపహాడ్‌, గోపాల్‌పూర్‌లలో వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు, చెరువులు, శిఖం భూములు, శ్మశానవాటిక స్థలాలు, ప్రైవేట్‌ స్థలాలు కూడా కబ్జాకు గురవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. రాజకీయపార్టీలకు చెందిన కొందరు భూ కబ్జాదారులు కుమ్మక్కై ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సహకారంతో అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.


ఇప్పటికే లోక్‌సత్తా భూకబ్జాలపై కార్యాచరణ చేపట్టిందని, దీంతో పాటు జిల్లా కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌ల ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ భూకబ్జాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. కొందరు భూకబ్జాదారులు రెవెన్యూ, పంచాయతీ అధికారులతో కుమ్మక్కై రికార్డులను తారుమారు చేసి దొంగ పత్రాలు సృష్టిస్తున్నారని అన్నారు.  తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తూ వేల కోట్ల రూపాయల విలువైన భూములు దోచుకుంటున్నారని అన్నారు. ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకుని, అక్రమ కట్టడాలను కూల్చివేయాలని, భూ కబ్జాదారులు, వారికి సహకరించిన అధికారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని పొన్నం ప్రభాకర్‌ లేఖలో డిమాండ్‌ చేశారు. భూకబ్జాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీలో ఈ భూములతో సంబంధంలేని వారిని, ఆరోపణలు లేని అధికారులతో విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌కు పొన్నం విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-08-14T10:29:22+05:30 IST