కోనుగోళ్లలో అవినీతిపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-10-23T04:32:29+05:30 IST

ఐకేపీ, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

కోనుగోళ్లలో అవినీతిపై చర్యలు తీసుకోండి
దూళిమిట్టలో ఏర్పాటు చేసిన ఒకరోజు నిరసన దీక్షలో మాట్లాడుతున్న జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి, అఖిలపక్ష నాయకులు

మద్దూరు, అక్టోబరు 22: ఐకేపీ, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. మద్దూరు, దూళిమిట్ట మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ దూళిమిట్టలో శుక్రవారం ఒకరోజు నిరసన దీక్షను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి, సీపీఎం జిల్లా నాయకుడు ఆలేటి యాదగిరి, సీపీఐ నాయకుడు అందె అశోక్‌ మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు రైసుమిల్లుల యజమానులతో కుమ్మకై రైతులను దోపిడీకి గురి చేశారని మండిపడ్డారు. అన్ని మండలాల్లో ఐకేపీ, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని కోరారు. లేదంటే రైతులు, యువకులు, ప్రజలను సమీకరించి పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్‌, శ్రీకాంత్‌, సీపీఐ నాయకులు నర్సింహచారి, మల్లేశ్‌, సీపీఎం మండల కార్యదర్శి విజేందర్‌, ఏఐటీయూసీ జిల్లా నాయకులు రవి, ప్రేమ్‌కుమార్‌, తాడెం శ్రీనివాస్‌, రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-23T04:32:29+05:30 IST