కరోనా నుంచి కోలుకున్నా తీసుకెళ్లం

ABN , First Publish Date - 2020-08-06T07:58:11+05:30 IST

కరోనాను జయించినా.. వైద్యులు డిశ్చార్జ్‌ చేసినా.. కొందరు వృద్ధులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తోంది. వారిని ఇంటికి తీసుకెళ్లడంలో వారి కుటుంబ సభ్యులు తీవ్ర జాప్యం చేస్తున్నారు.

కరోనా నుంచి కోలుకున్నా తీసుకెళ్లం

వృద్ధులను పట్టించుకోని కుటుంబ సభ్యులు

నెగెటివ్‌ వచ్చినప్పటికీ ఆస్పత్రిలోనే..

‘గాంధీ’లో దాదాపు 20 మృతదేహాలు 

వాటినీ తీసుకెళ్లని కుమారులు, కూతుళ్లు


అడ్డగుట్ట, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): కరోనాను జయించినా.. వైద్యులు డిశ్చార్జ్‌ చేసినా.. కొందరు వృద్ధులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తోంది. వారిని ఇంటికి తీసుకెళ్లడంలో వారి కుటుంబ సభ్యులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్నా కొందరు వృద్ధులు ఆస్పత్రిలోనే మృతి చెందుతున్నారు. ఇటువంటి మృతదేహాలు గాంధీ ఆస్పత్రి మార్చురీలో 15 నుంచి 20 వరకు ఉన్నాయి. ఆస్పత్రి అధికారులు ఎప్పటికప్పుడు చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి సమాచారం ఇస్తున్నారు. అయినా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి రావడంలేదు. 75 ఏళ్ల ఓ వృద్ధుడు వారం రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చేరాడు. నాలు గు రోజులకే కరోనాను జయించాడు. కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారమిచ్చారు. ఆయనను ఇంటికి తీసుకెళ్లాలని మరోసారి ఫోను చేశారు. అయితే, ఆస్పత్రి వైద్య సిబ్బంది ఫోను నంబరు కనిపించగానే కుటుంబ సభ్యులు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేస్తున్నారు. సమయానికి ఎవరూ రాకపోవడంతో ఆ వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. ఆ తర్వాత మృతదేహాన్నీ కుటుంబ సభ్యులు తీసుకెళ్లడం లేదు. ఇలా వృద్ధుల పట్ల కొడుకులు, కూతుళ్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 


మరణిస్తే కుటుంబ సభ్యులదే బాధ్యత

గాంధీ ఆస్పత్రిలో తాజాగా కరోనాకు చికిత్స తీసుకుని దాదాపు 10 మంది కోలుకున్నారు. వారిని డిశ్చార్జ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాం. చికిత్స నుంచి కోలుకున్న వారిని తీసుకెళ్లాలని చెప్పాం. కానీ, కుటుంబ సభ్యులు పట్టించుకోవట్లేదు.  కోలుకున్న వారు వెళ్లకపోతే ఇక్కడి మిగతా రోగుల పరిస్థితి ఏమిటి.?  కరోనా నెగెటివ్‌ వచ్చినా కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లకపోతే, వృద్ధ రోగులు ఆస్పత్రిలోనే మరణిస్తే కుటుంబ సభ్యులదే బాధ్యత అవుతుంది. 

-డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి, కొవిడ్‌-19 నోడల్‌ అధికారి  

Updated Date - 2020-08-06T07:58:11+05:30 IST