తలసాని క్షమాపణ చెప్పాలి: గంగపుత్ర సొసైటీ
ABN , First Publish Date - 2021-01-14T07:53:34+05:30 IST
హైదరాబాద్ కోకాపేటలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, గంగపుత్రులకు క్షమాపణ చెప్పాలని జగిత్యాల జిల్లా రూరల్ మండలం లక్ష్మీపూర్
జగిత్యాల, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కోకాపేటలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, గంగపుత్రులకు క్షమాపణ చెప్పాలని జగిత్యాల జిల్లా రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామ గంగపుత్ర సొసైటీ సభ్యులు డిమాండ్ చేశారు. జగిత్యాల- ధర్మారం ఎక్స్రోడ్ వద్ద లక్ష్మీపూర్ గంగపుత్ర సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. చెరువులు, కుంటలపై ముదిరాజ్లకు కూడా హక్కులు ఉంటాయని గంగపుత్రులను కించపరిచేలా మంత్రి తలసాని వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. కుంటలు, చెరువులపై అనాదిగా గంగపుత్రులకే పూర్తి హక్కులున్నాయని గుర్తుచేశారు. బాధ్యాతాయుతమైన మంత్రి పదవిలో ఉండి, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాల గడ్డ జగిత్యాల నుంచే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.