Taliban: సూసైడ్ బాంబర్ల కుటుంబాలకు 111 డాలర్లు, దుస్తులు, భూమి పంపిణీ
ABN , First Publish Date - 2021-10-20T22:16:16+05:30 IST
ఆఫ్ఘనిస్థాన్లోని గత ప్రభుత్వంపైనా, పాశ్చాత్య దేశాలపైనా
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్లోని గత ప్రభుత్వంపైనా, పాశ్చాత్య దేశాలపైనా ఆత్మాహుతి దాడులకు పాల్పడినవారు ఇస్లాం హీరోలని తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రశంసించింది. వారి కుటుంబ సభ్యులతో తాత్కాలిక ఇంటీరియర్ మినిస్టర్ సిరాజుద్దీన్ హక్కానీ సమావేశమై, వారికి దుస్తులు, నగదు బహుమతి ఇవ్వడంతోపాటు భూమిని ఇస్తామన్నారు.
కాబూల్లోని ఇంటర్కాంటినెంటల్ హోటల్లో ఓ కార్యక్రమం జరిగినట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలిపింది. యుద్ధం సమయంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడినవారి కుటుంబ సభ్యులతో సిరాజుద్దీన్ హక్కానీ సమావేశమైనట్లు తెలిపింది. హక్కానీ మాట్లాడుతూ, జీహాద్ను, అమరుల త్యాగాలను ప్రశంసించారు. వీరు ఇస్లాంకు, దేశానికి హీరోలని పేర్కొన్నారు.
తాలిబన్ అధికార ప్రతినిధి కరి సయీద్ ఖోస్టి మాట్లాడుతూ, ఆత్మాహుతి దాడులకు పాల్పడినవారి కుటుంబ సభ్యులకు బట్టలు, 111 డాలర్లు ఇచ్చినట్లు తెలిపారు. వీరికి భూములు కూడా ఇస్తామని తెలిపినట్లు చెప్పారు.
సిరాజుద్దీన్ హక్కానీ తన తండ్రి జలాలుద్దీన్ హక్కానీ నుంచి హక్కానీ నెట్వర్క్ ఉగ్రవాద సంస్థ బాధ్యతలను స్వీకరించారు. ఈ సంస్థ తాలిబన్లకు అనుబంధంగా పని చేస్తోంది. యుద్ధం సమయంలో అత్యంత కిరాతకమైన ఆత్మాహుతి దాడులకు ఈ సంస్థ పాల్పడినట్లు పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సిరాజుద్దీన్ ఆచూకీ తెలియజేసినవారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి ఇస్తామని అమెరికా ప్రకటించింది.