పాకిస్థాన్ మా రెండో ఇల్లు : తాలిబన్లు

ABN , First Publish Date - 2021-08-26T19:24:15+05:30 IST

పాకిస్థాన్ తమకు రెండో ఇల్లువంటిదని తాలిబన్లు

పాకిస్థాన్ మా రెండో ఇల్లు : తాలిబన్లు

కాబూల్ : పాకిస్థాన్ తమకు రెండో ఇల్లువంటిదని తాలిబన్లు చెప్తున్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామంటున్నారు. భారత దేశంతో మంచి సంబంధాలను కోరుకుంటున్నామని చెప్తున్నారు. ఆఫ్ఘన్, పాకిస్థాన్ సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నామన్నారు. తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పాకిస్థాన్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు తెలిపారు. 


ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దులు కలిసి ఉన్న దేశాలని, మతపరంగా కూడా తాము ఒకే గూటి పక్షులమని చెప్పారు. ఇరు దేశాల ప్రజలు పరస్పరం కలిసిపోతారన్నారు. పాకిస్థాన్‌తో సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నామన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ను తాము స్వాధీనం చేసుకోవడంలో పాకిస్థాన్ పాత్ర ఏమీ లేదన్నారు. తమ వ్యవహారాల్లో పాకిస్థాన్ ఎన్నడూ జోక్యం చేసుకోలేదన్నారు. 


భారత్-పాక్ పరిస్థితులపై...

భారత దేశం, పాకిస్థాన్ తమ మధ్య ఉన్న ప్రస్తుత సమస్యలను పరిష్కరించుకోవడానికి కలిసి కూర్చుని, చర్చించుకోవాలని ముజాహిద్ అన్నారు. భారత దేశంతో సహా అన్ని దేశాలతోనూ తాలిబన్లు మంచి సంబంధాలను కోరుకుంటున్నారని చెప్పారు. 


ఆఫ్ఘన్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై...

ఇస్లాంపై ఆధారపడిన బలమైన ప్రభుత్వాన్ని తాము కోరుకుంటున్నామని ముజాహిద్ చెప్పారు. ఆఫ్ఘన్లంతా ఇస్లాంలో భాగమేనని చెప్పారు. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఈ నెల 31న వెళ్ళిపోయే లోగానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తమ దళాలను ఉపసంహరించుకునే ప్రణాళికను అమెరికా ఆలస్యం చేయకూడదని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాలు తమ నియంత్రణలోకి వచ్చాయన్నారు. 


Updated Date - 2021-08-26T19:24:15+05:30 IST