కరోనా గురించి చైనాలో ఉన్న తమిళ వైద్య విద్యార్థిని ఏం చెప్పారంటే..
ABN , First Publish Date - 2020-03-28T17:10:46+05:30 IST
తిరుచ్చికి చెందిన యువతి మెడిసిన్ చదివేందుకు తిరుచ్చి నుండి చైనాలోని ఉరుమ్జీ ప్రాంతానికి వెళ్ళారు...
- కరోనా క్రూరత్వాన్ని గుర్తించలేకపోతున్నారు
- చైనాలో చదువుతున్న తమిళ వైద్య విద్యార్థిని
చెన్నై : తిరుచ్చికి చెందిన యువతి మెడిసిన్ చదివేందుకు తిరుచ్చి నుండి చైనాలోని ఉరుమ్జీ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడి జిన్జియాంగ్ వైద్య విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ ఫస్ట్ఇయర్లో చేరారు. తరగతులు ప్రారంభమైన కొద్ది రోజులేకే చైనాలో కరోనా వైరస్ ప్రబలింది. ఆమె చైనాలో బసచేసిన ప్రాంతం కరోనా సోకిన వూహన్ ప్రాంతం 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. కరోనా సోకిన తొలి రోజుల్లోనే చైనా అధికారులు ఆమె చదువుతున్న విశ్వవిద్యాలయంలో హాస్టళ్ళలో బసచేస్తున్న విద్యార్థులందరినీ సామాజిక దూరం పాటించే రీతిలో వేర్వేరు గుదుల్లో వేర్వేరుగా ఉంచిందని తెలిపారు.
వూహన్లో కరోనా తీవ్రరూపం దాల్చటంతో నిరుపమతోపాటు అక్కడే చదువుతున్న తమిళ విద్యార్థులంతా స్వదేశానికి తిరిగివచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తీవ్ర ప్రయత్నాల నడుమ ఆ యువతి గత ఫిబ్రవరి 11న తిరుచ్చికి తిరిగొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ అధికారులు ఆమెకి కరోనా సోకిన లక్షణాలు లేకపోయినా ముందుజాగ్రత్త చర్యగా ఆమెకు ఆరోగ్య పరీక్షలు జరిపి గృహనిర్బంధంలో ఉంచారు.
కరోనా తీవ్రత గురించి ఆమె స్పందిస్తూ.. భారతదేశంలో కరోనా వైరస్ క్రూరత్వం గురించి ప్రజలకు అవగాహన లేకపోవడం శోచనీయమని అన్నారు. చైనాను అల్లకల్లోలం చేసిన ఆ వైరస్ తీవ్రతను అందరూ గుర్తించి తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. తాను చదువుతున్న విశ్వవిద్యాలయానికి కరోనా సోకిన ప్రాంతానికి మూడు వేల కిలోమీటర్ల దూరం వున్నా అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు ఆ వైరస్ సోకకుండా ఉండేలా తమను కంటికి రెప్పలా కాపాడారని చెప్పారు. ప్రస్తుతం భారతదేశ ప్రజలంతా కరోనా వైరస్ కలిగించే ప్రాణనష్టాలు గురించిన అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని నిరుపమ చెప్పారు. చైనాలో పరిస్థితి బాగుపడిన తర్వాత మళ్ళీ అక్కడికి బయల్దేరి వెళతానని ఆమె తెలిపారు.