మూఢవిశ్వాసంతో మిత్రురాలిని పెళ్లాడిన ఓ వివాహిత

ABN , First Publish Date - 2021-04-14T16:57:45+05:30 IST

మూఢవిశ్వాసంతో మిత్రురాలిని పెళ్లాడిన ఓ వివాహిత.. ఆమెతో కలిసి తన ఇద్దరు కుమారులను చిత్ర హింసలకు గురిచేసింది.

మూఢవిశ్వాసంతో మిత్రురాలిని పెళ్లాడిన ఓ వివాహిత

తమిళనాడు: మూఢవిశ్వాసంతో మిత్రురాలిని పెళ్లాడిన ఓ వివాహిత.. ఆమెతో కలిసి తన ఇద్దరు కుమారులను చిత్ర హింసలకు గురిచేసింది. పిల్లలకు నిత్యం నరకం చూపించింది. భర్త సాయంతో వారిని పాశవికంగా బలి ఇచ్చేందుకు యత్నించింది. తెలివిగా తప్పించుకున్న చిన్నారులు ప్రాణాలు దక్కించుకున్నారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా రంగంపాండ్యం రైల్ నగర్‌కు చెందిన రామలింగం, రంజిత దంపతులకు దీపక్, కిశాంత్ ఉన్నారు. రామలింగం చీరల వ్యాపారం చేసేవాడు. తర్వాత ఇందుమతి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెను కూడా అదే ప్రాంతానికి తీసుకువచ్చి వేరే ఇంట్లో ఉంచాడు. ఇందుమతి స్నేహితురాలు ధనలక్ష్మి అప్పుడప్పుడు వారి ఇంటికి వచ్చి వెళుతుండేది.


ఈ క్రమంలో రంజితతో ధనలక్ష్మికి పరిచయం ఏర్పడింది. వారి స్నేహాన్ని గమనిస్తూ వచ్చిన రామలింగం.. ఇద్దరూ శివుడు, పార్వతిలా ఉన్నారని చెప్పేవాడు. కొన్నాళ్లకు తాము పెళ్లి చేసుకుంటామని ధనలక్ష్మి, రంజిత తెలుపగా రామలింగం అంగీకరించాడు. ఇంట్లోనే తన కుమారుల ఎదుటే వారికి వివాహం చేశాడు. అనంతరం అతీత శక్తులు వస్తాయనే నమ్మకంతో ధనలక్ష్మిని నాన్న అని, రామలింగంను మామా అని పిలవాలని కుమారులను చిత్రహింసలకు గురిచేశారు. స్కూలుకు వెళ్లనీయకుండా ఇంట్లో పనులన్నీ పిల్లలతోనే చేయించారు. శానిటైజర్ తాగించడం, ఒంటికి కారంపూసి ఎండలో పడుకోబెట్టడం లాంటి దారుణాలకు పాల్పడ్డారు. చివరికి వారిని నరబలి ఇచ్చేందుకు వారు యత్నించారు. ఈ విషయాన్ని గ్రహించిన పిల్లలు వెంటనే తమ తాతయ్య ఇంటికి పారిపోయి జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రంజిత, ధనలక్ష్మి, రామలింగంలను ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2021-04-14T16:57:45+05:30 IST