చిల్లచెట్లతో నిండిన తమ్మలూరు రహదారి

ABN , First Publish Date - 2022-01-25T05:44:30+05:30 IST

మండల కేంద్రం ముండ్లమూరు నుంచి తమ్మలూరు వెళ్లే ప్రధాన రహదారి చిల్లచెట్లతో మూసుకుపోయింది.

చిల్లచెట్లతో నిండిన తమ్మలూరు రహదారి
చిల్లచెట్లతో నిండిన తమ్మలూరు రహదారి

ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు 

ముండ్లమూరు, జనవరి 24 : మండల కేంద్రం ముండ్లమూరు నుంచి తమ్మలూరు వెళ్లే ప్రధాన రహదారి చిల్లచెట్లతో మూసుకుపోయింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిల్ల చెట్లు మూసుకు పోవడంతో పాటు రహదారిపై వాడిన కంకర లేచి గోతులు పడ్డాయి. దీంతో ఈ రహదారిపై ప్రయాణం అంటేనే ప్రజలు  హడలి పోతున్నారు. ముండ్లమూరు నుంచి తమ్మలూరు వెళ్లే ప్రధాన రహదారి రెండు కిలోమీటర్లు ఉంటుంది. రహదారికి ఇరువైపులా చిల్ల చెట్లు అల్లుకున్నాయి. ఇటు ముండ్లమూరు నుంచి వచ్చే వాహనాలు కానీ, అటు ఈదర, అగ్రహారం, పూరిమెట్ల, తమ్మలూరు నుంచి వచ్చే వాహనాలు గానీ కనపడక ప్రమాదాలకు గురవుతున్నారు. రెండు వారాల క్రితం తమ్మలూరు మలుపు వద్ద దర్శి మండలం రాజంపల్లికి చెందిన అద్దంకి మస్తాన్‌ కూడా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. నిత్యం వాహన చోదకులు ఈ రోడ్డు పై ప్రయాణించాలంటే వాహనాలకు పంచర్లు అవుతున్నాయి. టైర్లు పగులుతున్న ఘటనలు ఉన్నాయి. పంచాయతీరాజ్‌ అధికారులు జోక్యం చేసుకొని రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చిల్లచెట్లను తొలగించడంతో పాటు మరమ్మత్తులు చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. ముండ్లమూరు మండలంలో సగ భాగం మంది గ్రామాల ప్రజలు నిత్యం ఈ రహదారి పైనే ప్రయాణం చేస్తుంటారు. రాత్రుల సమయంలోనైతే కొత్త వ్యక్తులైతే రహదారిపై ప్రయాణించలేక పోతున్నారు.  రోడ్డుకు ఉన్న గోతుల విషయం తెలియక వేగంగా వాహనాలు వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి చిల్లచెట్లను తొలగించి తాత్కాలిక మరమ్మతులు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-01-25T05:44:30+05:30 IST